- .సీఎం జడ్చర్లకు రాకముందే ఖాతాల్లోకి డబ్బులు: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్లకు సీఎం రేవంత్ రెడ్డి రాకముందే ఉద్దండాపూర్ నిర్వాసితుల ఖాతాలో పరిహారం పడిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎ స్ సర్కార్ భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్డబ్బులివ్వకుండా రోడ్డున పడేసిందని విమర్శించారు. శుక్రవారం జడ్చర్లలో సీఎం రేవంత్రెడ్డికి స్వాగతం పలికిన అనంతరం అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఉదండాపూర్ తప్ప వేరే ఏ విషయం గురించి మాట్లాడటం లేదని కొందరు హేళన చేస్తున్నారని, వారికి ఈ రిజర్వాయర్ వల్ల కలిగే ఉపయోగాలే తెలియదని చెప్పారు.
రైట్ కెనాల్ పూర్తయితే మునుగోడు వరకు, లెప్ట్ కెనాల్ద్వారా కొడంగల్ వరకు నీళ్లు వస్తాయని వివరించారు. గత ప్రభుత్వం భూసేకరణ చేసి ఎకరానికి ఆరున్నర లక్షలు ఇస్తామన్నదని, ఆ డబ్బుతో నవాబుపేటలో భూమి కొనడానికి వెళ్తే ఎకరాకు 50 లక్షలకు పెరిగిందన్నారు. రైతులకు ప్లాట్లు ఇస్తున్న ప్రాంతాలకు వారు గతంలో నివసించిన ఊర్ల పేర్లే పెట్టాలని సీఎంను కోరారు. ప్రతిపక్ష నాయకులు ఏ మోహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని నిలదీశారు. జడ్చర్లలో బైపాస్కు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
