పీఎస్ఎల్వీ ఖాతాలో మరో విజయం..

పీఎస్ఎల్వీ ఖాతాలో మరో విజయం..

నింగిలోకి ఈఓఎస్​ శాటిలైట్

లాక్ డౌన్ తర్వాత ఇస్రో తొలి ప్రయోగం
భారీ వర్షం.. లాంచింగ్ లేట్

శ్రీహరికోట(ఏపీ)/ బెంగళూరు: వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో రేసుగుర్రం పీఎస్ఎల్వీ ఖాతాలో మరో విజయం చేరింది. భూ పరిశీలన కోసం తయారుచేసిన ఎర్త్​ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈఓఎస్)​ను పీఎస్ఎల్వీ సీ49 రాకెట్​ విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. శనివారం మధ్యాహ్నం 3గంటల 12 నిమిషాలకు ఈఓఎస్​తో పాటు మరో తొమ్మిది శాటిలైట్లతో రాకెట్​ నింగికెగిరింది. భారీ వర్షం కారణంగా షెడ్యూల్​ టైమ్​కన్నా పది నిమిషాలు ఆలస్యంగా పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. పదిహేను నిమిషాల తర్వాత ఈఓఓస్​ శాటిలైట్​ను రాకెట్​కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత మిగతా తొమ్మిది రాకెట్లను ఒక్కొక్కటిగా కక్ష్యలోకి చేర్చిందని ఇస్రో చైర్మన్​ కె.శివన్​ ప్రకటించారు. కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే.

ప్రయాణం మొత్తం సాఫీగా…

పీఎస్ఎల్వీ సీ 49 రాకెట్​ ప్రయోగానికి 26 గంటల కౌంట్​డౌన్​ శుక్రవారమే ప్రారంభమైంది. షెడ్యూల్​ టైమ్​ శనివారం మధ్యాహ్నం 3:03 నిమిషాలకు రాకెట్​ గాల్లోకి ఎగరాలి. టైమ్​ ప్రకారం పనులన్నీ జరిగిపోతున్నయ్.. అయితే, కౌంట్​డౌన్​ పూర్తయ్యే సమయానికి భారీ వర్షం మొదలైంది. దీంతో సైంటిస్టులు రాకెట్​ ప్రయోగాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాతావరణం కాస్త తెరిపివ్వగానే పది నిమిషాలు ఆలస్యంగా రాకెట్​ మబ్బుల్లోకి దూసుకెళ్లింది.

లాంచింగ్​కు ప్రత్యేక ఏర్పాట్లు..

కరోనా నేపథ్యంలో లాంచింగ్​కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైంటిస్టులు, మిషన్, ప్రాజెక్ట్​ డైరెక్టర్లు మాస్కులు ధరించి, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించారు. మీడియా, పబ్లిక్​గ్యాలరీలను క్లోజ్​ చేశారు. ఇస్రో వెబ్​సైట్​తో పాటు సోషల్​ మీడియా, ఇతరత్రా వేదికలపై రాకెట్​ ప్రయోగాన్ని లైవ్​ టెలికాస్ట్​ చేశారు.

సైంటిస్టులకు అభినందనలు: ప్రధాని మోడీ
‘పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తిచేసిన ఇస్రో టీమ్ కు అభినందనలు. కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తక్కువ సిబ్బందితో మిషన్ ను సక్సెస్ ఫుల్ చేశారు’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో సైంటిస్టులను మెచ్చుకున్నరు.
ఇస్రోకు సీఎం కేసీఆర్ కంగ్రాట్స్
పీఎస్ఎల్వీ- రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సైన్స్, టెక్నాలజీల డెవలప్ మెంట్ కు ఈ శాటిలైట్ తోడ్పడుతుందన్నా రు. ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన సైంటిస్టులతో పాటు టెక్నికల్ స్టాఫ్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.