ముంబై: షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ఎన్సీపీ నాయకులకు క్లోజ్గా ఉండే సునీల్ పాటిల్ అనే వ్యక్తే ప్రధాన సూత్రధారి అని బీజేపీ నేత మోహిత్ భారతీయ ఆరోపించారు. కరోనా లాక్డౌన్ టైంలో దావూద్ ఇబ్రహీం అనుచరుడు డ్రగ్ పెడ్లర్ చింకు పఠాన్ను మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ గెస్ట్ హౌస్లో కలిశారని శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. క్రూయిజ్ షిప్పై ఎన్సీబీ అధికారులు దాడి చేయడానికి ముందు నుంచే సామ్ డిసౌజా, గోసావితో పాటిల్ టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఎన్సీబీ అధికారులపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సందర్భంగా సునీల్ పాటిల్ పేరు బయటికి వచ్చింది. ఎన్సీపీ ఫౌండర్ మెంబర్స్లో సునీల్ కూడా ఒకరు. గడిచిన 20 ఏండ్లుగా చాలా మంది ఎన్సీపీ లీడర్లతో ఆయన క్లోజ్గా ఉంటున్నారు. అనిల్ దేశ్ముఖ్ కొడుకు హ్రిషికేశ్ దేశ్ముఖ్, సునీల్ క్లోజ్ ఫ్రెండ్స్” అని భారతీయ ఆరోపించారు. మరోవైపు డ్రగ్స్కేసుతో పాటు 6 కేసులను దర్యాప్తు చేయడానికి ఎన్సీబీ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం ముంబైకి చేరుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని సిట్ కేసు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది.