‘కోర్బె వాక్స్’ తేనున్న బయలాజికల్‑ ఈ
30 కోట్ల డోసులు కొనేందుకు కేంద్రం ఒప్పందం
అడ్వాన్స్గా రూ. 1,500 కోట్లు చెల్లించాలని నిర్ణయం
ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కరోనా టీకా తయారీ
న్యూఢిల్లీ: కొవాగ్జిన్ తర్వాత మరో మేడ్ ఇన్ ఇండియా కరోనా టీకా అందుబాటులోకి రాబోతోంది. హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ ‘బయలాజికల్ ఈ’.. కోర్బెవాక్స్ పేరుతో వ్యాక్సిన్ను తీసుకొస్తోంది. ఈ టీకా కొనుగోలు కోసం కంపెనీతో కేంద్ర ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. 30 కోట్ల డోసుల కోసం రూ.1,500 కోట్లను అడ్వాన్స్గా చెల్లించాలని నిర్ణయించింది. టీకాలను ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కంపెనీ తయారు చేసి స్టోర్ చేస్తుందని, మరికొద్ది నెలల్లోనే అవి అందుబాటులోకి వస్తాయని హెల్త్ మినిస్ట్రీ గురువారం వెల్లడించింది. అడ్వాన్స్ కోసం బయలాజికల్ ఈ ప్రపోజల్స్ పంపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
కంపెనీ ప్రపోజల్స్ను నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలించి ఆమోదించాలని రికమండ్ చేసిందని చెప్పింది. రీసెర్చ్, డెవలప్మెంట్, కాస్ట్ పరంగా స్వదేశీ టీకా తయారీ కంపెనీలను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామంది. వివిధ రకాల స్టడీస్ కోసం బయలాజికల్ ఈ కంపెనీకి బయెటెక్నాలజీ డిపార్ట్మెంట్ కూడా రూ. 100 కోట్లు అందించిందని చెప్పింది.
ఇంకో రెండు కంపెనీల వ్యాక్సిన్లూ ఇక్కడే
అమెరికాలోని టెక్సాస్కు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్తో కలిసి ఆర్బీడీ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ కోర్బెవాక్స్ను బయలాజికల్ ఈ అభివృద్ధి చేసింది. ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. మంచి రిజల్ట్స్ వచ్చాయి. మూడో దశ ట్రయల్స్ కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి పొందింది. ఇటు జాన్సన్ అండ్ జాన్సన్ డెవలప్ చేసిన టీకాను కూడా దేశంలో బయోలాజికల్ ఈ సంస్థే ఉత్పత్తి చేయనుంది. ఏటా60 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. కెనడా సంస్థ ప్రావిడెన్స్ థెరప్యూటిక్స్కు చెందిన ఎంఆర్ఎన్ఏ టీకానూ దేశంలో బయలాజికల్ ఈ సంస్థే ఉత్పత్తి చేయనుంది.