- టీకా డోసుల మధ్య గ్యాప్ మంచిదంటున్న సైంటిస్టులు
- 6 నెలల తర్వాత సెకండ్ డోస్తో మెరుగైన ఫలితాలంటున్న కెనడా స్టడీ
- 9 నుంచి 15 వారాలుండాలని మరికొందరు సైంటిస్టుల కామెంట్
న్యూఢిల్లీ:ఈ మధ్యే కొవిషీల్డ్ సెకండ్ డోసుకు ఆరు వారాలుగా ఉన్న గ్యాప్ను 12 నుంచి 18 వారాలకు పెంచింది కేంద్ర సర్కార్. కరోనా వ్యాక్సిన్ల కొరతను కప్పి పుచ్చుకునేందుకే రెండు డోసుల మధ్య గ్యాప్ను పెంచారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే, రెండు డోసుల మధ్య గ్యాప్ ఎంత ఎక్కువుంటే.. వ్యాక్సిన్ అంత బాగా పనిచేస్తుందని ప్రపంచంలోని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. వ్యాక్సిన్ ఏదైనా సరే ఒక్క డోసు వేసుకున్న తర్వాత రెండో డోసుకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటే 300 శాతం వరకు యాంటీబాడీలు తయారవుతాయని సైంటిస్టులు అంటున్నారు.
ఇమ్యూనిటీ పెరుగుతది..
ఒక డోస్ వ్యాక్సిన్తో ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు పెరుగుతుందని సైంటిస్టులు అంటున్నారు. దానికి ఇంకొంచెం టైం ఇస్తే వైరస్ను నాశనం చేసేందుకు మరింత శక్తిమంతంగా మారుతుందని చెప్తున్నారు. ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ అంత ఎక్కువ పవర్ఫుల్గా తయారవుతుందని వివరిస్తున్నారు. అప్పుడు సెకండ్ డోస్ వేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. 80 ఏండ్లకు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చి.. సెకండ్ డోస్ను మూడు వారాలకు బదులు మూడు నెలలకు ఇస్తే 3.5 రెట్ల యాంటీబాడీలు తయారయ్యాయని చెప్తున్నారు. రెండు డోసుల మధ్య తేడా 9 నుంచి 15 వారాలుంటే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు, వైరస్ బారిన పడడం, మరణాలు చాలా వరకు తగ్గాయని అంటున్నారు. అదే గ్యాప్ 6 నెలలుంటే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కెనడా సైంటిస్టుల స్టడీలో తేలింది. సెకండ్ డోస్ ను ఆలస్యంగా ఇవ్వడం వల్ల కొన్ని వేల మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసేందుకు వీలవుతుందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేల్ ఫిషర్ చెప్పారు. ఈ లెక్కన రోజూ 40 వేల మందికి టీకాలు వేసేందుకు టార్గెట్ పెట్టుకున్నామన్నారు. ఎండాకాలం నాటికి 47 లక్షల మందికి టీకాలిస్తామన్నారు.
అందరికీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు
వ్యాక్సిన్ సెకండ్ డోస్ను లేట్ చేసినా లాభమే తప్ప నష్టమైతే ఉండదని మాయో క్లినిక్ వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్ వైరాలజిస్ట్ గ్రెగరీ పోలండ్ అన్నారు. ఫస్ట్ డోస్ వేసుకున్నాక సెకండ్ డోస్కు ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కుదురుతుందన్నారు. ఇప్పటికే నాలుగు వారాల గ్యాప్ను 6 నుంచి 8 వారాలకు పెంచింది సింగపూర్ ప్రభుత్వం. ఇండియా సహా మరికొన్ని దేశాలూ రెండు డోసుల మధ్య టైంను పెంచాయి.