రైతుల లోన్ రికవరీకి వస్తే చేతులు విరుగుతాయ్: బీజేపీ ఎంపీ

రైతుల లోన్ రికవరీకి వస్తే చేతులు విరుగుతాయ్: బీజేపీ ఎంపీ
  • కిసాన్ ఆక్రోశ్ ఆందోళన్ సభలో ఎంపీ జనార్దన్ మిశ్రా కామెంట్స్

రైతుల దగ్గర లోన్ రివకరీ కోసం ఎవరైనా కాంగ్రెస్ నేతలు గానీ, పోలీసులు గానీ వస్తే తన్నులు తప్పవు. వారి చేతులు విరుగుతాయ్ జాగ్రత్త… అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా. కాదని వెళ్లారో చావును కొనితెచ్చుకున్నట్లే అంటూ వార్నింగ్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ హామీ ఇచ్చి, ప్రభుత్వంలోకి వచ్చాక రైతులను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారాయన.

రైతులకు మద్దతుగా ‘కిసాన్ ఆక్రోశ్ ఆందోళన్’ పేరుతో తన నియోజకవర్గమైన రేవాలో సభ నిర్వహించారు ఎంపీ జనార్దన్ మిశ్రా. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందంటూ సీఎం కమలనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్దకు కాంగ్రెస్ నేతలెవరైనా వస్తే ప్రతీకారం తీర్చుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని జనార్దన్ హెచ్చరించారు. రుణాల వసూలు చేయడం కోసం వెళ్తే చేతులు విరగ్గొడతారని, అంతటితో ఆగక చితక్కొట్టి చంపేస్తారని అన్నారు. ఏం జరిగినా రైతులకు అండగా బీజేపీ నిలబడుతుందని ఆయన చెప్పారు.