తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఏపీ ఇంజనీర్లు

తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఏపీ ఇంజనీర్లు
  •                 సాగర్‌ టు శ్రీశైలం ఎత్తిపోతలకు నో
  •                 దుమ్ముగూడెం నుంచి శ్రీశైలానికి, పోలవరం నుంచిసాగర్‌కు ఎత్తిపోయాలని ప్రతిపాదన
  •                 ఇరురాష్ట్రాల ఇంజనీర్ల చర్చలు.. వారంలో మరోసారి భేటీ
  •                 అలైన్‌మెంట్లకు అప్పుడే తుది రూపు
  •                 ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలకు రిపోర్టు

నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. దుమ్ముగూడెం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు, పోలవరం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించింది. మంగళవారం జలసౌధలో తెలంగాణ, ఏపీ ఇంజనీర్లు భేటీ అయ్యారు. ఈఎన్సీలు మురళీధర్‌, వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో మూడు గంటల పాటు చర్చించారు. గోదావరి నుంచి ఎంతమేర నీటిని తరలించడం సాధ్యమవుతుందన్న విషయమై చర్చించారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు 70 రోజులపాటు 280 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయన్న అంచనాకు వచ్చారు. సమావేశంలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు రెండేసి ప్రపోజల్స్‌ను ప్రతిపాదించారు. నీటిని తరలించే పాయింట్‌, ఎక్కడి వరకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది, ఎన్ని పంపుహౌస్‌లు అవసరం, నీటిని ఎలా తరలించాలి, ఎంత భూమి సేకరించాలి, కరెంట్‌ ఎంత అవసరం ఉంటుంది, నిర్మాణ వ్యయం ఎంత కావొచ్చన్న అంశాలపై చర్చించారు.

సాగర్‌కు, శ్రీశైలానికి వేర్వేరుగా..

సాగర్‌కు వేరుగా, శ్రీశైలానికి వేరుగా రెండేసి టీఎంసీల నీటిని తరలించాలని ఏపీ ఇంజనీర్లు ప్రతిపాదించారు. సాగర్‌‌కు నాలుగు టీఎంసీలు ఎత్తిపోసి అక్కడి నుంచి శ్రీశైలానికి ఇంకో రెండు టీఎంసీలు ఎత్తిపోయాలన్న తెలంగాణ ఇంజనీర్ల ప్రతిపాదనను ఏపీ ఇంజనీర్లు తిరస్కరించారు. తమ రాష్ట్ర అవసరాలు, భౌగోళిక స్వరూపం మేరకు రెండు వేర్వేరు పాయింట్లను, వేర్వేరు మార్గాల్లోనే నీటిని తరలించాలని కోరారు. కృష్ణా నదిపై ఆధారపడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లో నిర్మించిన ప్రాజెక్టులకు1,300 టీఎంసీల నీళ్లు అవసరమని తేల్చారు. గడచిన 15 ఏళ్లుగా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి ఉభయ రాష్ట్రాలకు చేరుతున్న నీటి లెక్కలపై చర్చలు జరిపారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచిన తర్వాత కృష్ణా నది నుంచి 400 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చారు. ఈ లెక్కన కృష్ణా బేసిన్లో 900 టీఎంసీల లోటు ఉంటుందని అంచనా వేశారు. గోదావరి నదిలో 60 నుంచి 70 రోజులు మాత్రమే వరద ఎక్కువగా ఉంటుందని సీడబ్ల్యూసీ లెక్కల ద్వారా తేల్చారు. ఈ రోజుల్లో వెయ్యి టీఎంసీల నీళ్లు గోదావరిలో ఉన్నట్టు లెక్క తేల్చారు. వీటిలో రోజుకు నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసినా గరిష్టంగా 240 నుంచి 280 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్‌‌ చేయగలిగమని అంచనాకు వచ్చారు. ఈ లెక్కన ఇరు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టులకు 620 టీఎంసీల నీటి కొరత ఉంటుందని తేల్చారు. ఇంతకుమించి కృష్ణా బేసిన్‌‌లోని లోటును తీర్చడం సాధ్యం కాదని అంచనాకు వచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపైనా సర్వే చేయాలని, వారం రోజుల్లోగా మళ్లీ భేటీ అయి లింక్‌‌ ప్రాజెక్టులపై పూర్తిగా చర్చించాలని నిర్ణయించారు. తర్వాతే తెలంగాణ, ఏపీ సీఎంలకు రిపోర్టులు సమర్పిస్తామని ఈఎన్సీలు తెలిపారు.

తెలంగాణ చెప్పిందిదీ..

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోని కంతనపల్లికి 1.90 కి.మీ. దిగువన రాంపూర్‌‌ వద్ద బ్యారేజీ కట్టి అక్కడ్నుంచి టన్నెళ్లతో 2 టీఎంసీల నీటిని లక్నవరం చెరువులో ఎత్తిపోయాలి. అక్కడ్నుంచి ఎస్సారెస్పీ డీబీఎం 38 ద్వారా కాకతీయ కాల్వకు తరలిస్తారు. కాకతీయ కాల్వ 346 కి.మీ.ల వద్ద లిఫ్ట్‌‌ చేసి వలిగొండ, చర్లపల్లి చెరువుల మీదుగా ఉదయసముద్రం రిజర్వాయర్‌‌కు, అక్కడ్నుంచి హాలియా వాగు ద్వారా అడవిదేవునిపల్లి రిజర్వాయర్‌‌కు అక్కడ్నుంచి సాగర్‌‌కు తరలించాలి. మధ్యలో ఎస్సారెస్పీ స్టేజ్‌‌ -2, ఎస్‌‌ఎల్బీసీ, డిండి, ఉదయసముద్రం ఆయకట్టు 12 లక్షల ఎకరాలను 70 టీఎంసీలతో స్థిరీకరిస్తారు. 70 టీఎంసీలను సాగర్‌‌కు తరలిస్తారు. పోలవరం కుడి కాల్వ ద్వారా 2 టీఎంసీల నీళ్లను గోవిందాపురం రిజర్వాయర్‌‌కు, అక్కడ్నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నీటిని తరలించాలి. అక్కడ లిఫ్టు కట్టి సాగర్‌‌ టెయిల్‌‌పాండ్‌‌కు తరలించాలి. అక్కడ రివర్సబుల్‌‌ టర్బైన్లతో ప్రాజెక్టులో పోస్తారు. సాగర్‌‌ నుంచి ఓ టీఎంసీని ఎత్తి కృష్ణా నది ద్వారా శ్రీశైలానికి తరలించాలి. ఈ రెండింటిని కలిపి రూ.85 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు.

ఏపీ ఏం చెప్పిందంటే..

దుమ్ముగూడెం ఆనకట్టను బ్యారేజీగా అభివృద్ధి చేసి అక్కడి నుంచి అక్కంపల్లి మీదుగా రెండు టీఎంసీలను హాలియావాగు వరకు తరలించాలి. అక్కడ్నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్లకు గ్రావిటీ కాల్వలు, టన్నెళ్ల ద్వారా డిండి ప్రాజెక్టు కింది నుంచి ఎర్రగుంట వాగులో పోసి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలి. 370 కి.మీ. దూరం నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని, కనీసం నాలుగైదు పంపింగ్‌‌ స్టేషన్లు అవసరమని అంచనా వేశారు. పోలవరం కుడి కాల్వకు సమాంతరంగా మరో కాల్వ తవ్వి పులిచింతలకు రెండు టీఎంసీల నీళ్లను తరలిస్తారు. అక్కడ నీటిని లిఫ్ట్‌‌ చేసి గోవిందాపురం రిజర్వాయర్‌‌కు అక్కడ్నుంచి పులిచింతలకు తరలిస్తారు. పులిచింతల ఫోర్‌‌షోర్‌‌లో పంప్‌‌హౌస్‌‌ నిర్మించి అక్కడ నీటిని ఎత్తి సాగర్‌‌ టెయిల్‌‌పాండ్‌‌లో పోస్తారు. అక్కడి రివర్సబుల్‌‌ టర్బైన్ల ద్వారా నీటిని ఎత్తి సాగర్‌‌లో పోస్తారు.