ఏపీ అసెంబ్లీలో ఎన్ఆర్సీపై కీలక నిర్ణయం

ఏపీ అసెంబ్లీలో ఎన్ఆర్సీపై కీలక నిర్ణయం

రాష్ట్ర శాసనసభలో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై తీర్మానం

రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోం

2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ ఉండాలి

శాసనసభలో తీర్మానం ఆమోదించిన సభ

కేంద్రం చర్యల వల్ల ముస్లింలలో భయం నెలకొంది

ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలి

సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ను అమలు చేయబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్‌పీఆర్‌–2020 (నేషనల్‌ పాపులేషన్‌ ఆఫ్‌ రిజిస్టర్‌–2020)లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళన నెలకొందని, అందువల్ల 2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ అమలు చేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌సీఆర్, ఎన్‌పీఆర్‌కు సంబంధించి రాష్ట్ర శాసనసభ బుధవారం ఒక తీర్మానం ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు.

మైనారిటీల్లో అభద్రతా భావం
ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమైన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్‌ఆర్‌సీ), నేషనల్‌ పాపులేషన్‌ ఆఫ్‌ రిజిస్టర్‌–2020 వల్ల రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు అభద్రతా భావానికి లోనై ఉన్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు.

మైనారిటీలకు మనోధైర్యం

మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగిస్తూ వారికి మనోధైర్యం ఇవ్వడంతో పాటు, వారి కోసం సీఎం గారు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. అందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని గతంలో సీఎం అన్నారని ఆయన ప్రస్తావించారు.

అభ్యంతరకర అంశాలు

గతంలో 2010,2015 సంవత్సరాలలో కూడా ఎన్‌పీఆర్‌ నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఫార్మట్‌లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టినతేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు, ఇంకా మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

క్యాబినెట్‌లోనూ తీర్మానం

మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగిందన్న అంజాద్‌బాషా, ఆ తీర్మానం ఆధారంగా ఇప్పుడు సభలో మరో తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ‘మీ (స్పీకర్‌) అనుమతితో ఆ తీర్మానం ప్రవేశపెడుతున్నాను.
2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ కొనసాగించాలని, అప్పటి వరకు ఇప్పటి ఎన్‌పీఆర్‌ ఆపాలని కోరుతున్నాం. ఎన్‌ఆర్‌సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉంది’అంటూ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా బిల్లును ప్రవేశపెట్టగా.. సభ దాన్ని ఆమోదించింది.

For More News..

గాంధీభవన్ లో కరోనా కలకలం.. వారం రోజులుగా నాయకులంతా అక్కడే ప్రెస్ మీట్

సీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్

శాసనమండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్

కరోనాతో చనిపోయిన పోలీసులకు రూ. 3 లక్షల సాయం ప్రకటించిన ఫార్మా కంపెనీ