గోదావరి–కృష్ణా లింక్‌పై ఏపీ వెనుకడుగు!

గోదావరి–కృష్ణా లింక్‌పై ఏపీ వెనుకడుగు!

గోదావరి‌‌ నుంచి కృష్ణాకు నీటిని మళ్లించడంపై రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ప్రశ్నార్థకంగా మారింది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు కావటంతో ప్రతిపాదనల దశలోనే ఏపీ ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో జరిగిన ప్రాథమిక చర్చల మేరకు ఇటీవలే ప్రాజెక్టు రూట్ మ్యాప్​ను, ప్రతిపాదనలను తయారు చేసే బాధ్యతలను ఇరిగేషన్​ ఇంజనీర్లకు అప్పగించారు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల ఇంజనీర్లు మంగళవారం హైదరాబాద్​లోని జలసౌధలో భేటీ కానున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా లేదని అధికారుల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ మీటింగ్​లో ఏం డిస్కస్​ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వేర్వేరుగా ప్రతిపాదనలు రెడీ చేశాయి. రాంపూర్‌ నుంచి నాగార్జున సాగర్‌కు రెండు టీఎంసీలు, మార్గమధ్యం నుంచి శ్రీశైలం వరకు మరో రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. పోలవరం నుంచి పులిచింతల మీదుగా సాగర్‌ టెయిల్‌ పాండ్‌కు,  అక్కడ్నుంచి శ్రీశైలం తీసుకెళ్లేలా ఏపీ ప్రపోజల్స్‌‌‌‌ తయారు చేసింది. వేర్వేరు ప్రతిపాదనలతో పాటు  ప్రాజెక్టుకయ్యే భారీ ఖర్చును భరించే విషయంలో ఏపీ ప్రభుత్వం వెనుకాడుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు రూ.82,500 కోట్ల ఖర్చయింది. ఇప్పుడు సాగర్​కు నీటిని తరలించే స్కీమ్​కు తెలంగాణ ప్రపోజ్​చేసిన డిజైన్​ ప్రకారం అంతకు మించి ఖర్చవుతుందని, రూ.85 వేల కోట్ల నుంచి దాదాపు రూ. లక్ష కోట్లకు చేరుతుందని ఏపీ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్​ ప్రకారం.. అందులో మూడో వంతు నిధులే సరిపోతాయని,  దాదాపు  రూ.35 వేల కోట్లకు మించదని లెక్కలేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఏపీ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మేరకు ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉండటమే మేలని ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే రెండు రాష్ట్రాల మధ్య బలపడ్డ కొత్త బంధం చెడిపోకుండా ప్రతిపాదనలు, చర్చలు కొనసాగించాలని అధికారులకు సూచించినట్టు సమాచారం.

సీతారామ కార్పొరేషన్‌‌‌‌ ద్వారా నిధులు

రాంపూర్‌‌‌‌–సాగర్‌‌‌‌ లింక్‌‌‌‌కు అవసరమైన మెజార్టీ నిధులను సీతారామ లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ద్వారా సమీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం వ్యయంలో 80 శాతానికి పైగా రుణ సమీకరణ ద్వారానే సర్దుబాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీళ్లను ఏపీ ఉపయోగించుకుంటుంది కాబట్టి ఖర్చులో ఆ రాష్ట్రం కూడా వాటా పంచుకోవాల్సి ఉంటుందని ఇంజనీర్లు అంటున్నారు. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావటంతో సీతారామ కార్పొరేషన్​ ద్వారా నిధుల సమీకరణకు అడ్డంకులు తలెత్తితే మరో కొత్త కార్పొరేషన్‌‌‌‌ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మంగళవారం జరిగే మీటింగ్​లో  రెండు రాష్ట్రాలు సిద్ధం చేసిన ప్రతిపాదనలు, వాటి అలైన్‌‌‌‌మెంట్లు, పంపుహౌస్‌‌‌‌లు, గ్రావిటీ కాల్వల స్వరూపం తదితరాలపై చర్చిస్తారు.

35 వేల ఎకరాల ముంపు

రాంపూర్‌‌‌‌ నుంచి అడవి దేవులపల్లికి మధ్యలో కనీసం నాలుగు నుంచి ఆరు పంప్​ హౌజ్​లు అవసరమని అంచనా వేశారు. ఈ రూట్లో ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచడం, కాల్వల తవ్వకానికి దాదాపు 30 వేల నుంచి 35 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని భావిస్తున్నారు. లక్నవరం నుంచి ఉదయ సముద్రం వరకు ఎస్సారెస్పీ స్టేజ్‌‌‌‌ -2, ఏఎంఆర్పీ, సాగర్‌‌‌‌ ఎడమ కాలువ, భక్తరామదాసు ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే వీలుందని, కొత్తగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే వీలుందని ఇంజనీర్లు చెబుతున్నారు. మిగతా ఒక టీఎంసీని సాగర్‌‌‌‌లో పోసి ఏపీ కుడి కాల్వ అవసరాలకు వినియోగించుకునేలా ప్రతిపాదిస్తున్నారు.

పూర్తి డీపీఆర్​కు రెడీ

రాంపూర్‌‌‌‌ నుంచి సాగర్‌‌‌‌కు ఎత్తిపోతలపై అవసరమైతే జాయింట్‌‌‌‌ సర్వేకు సిద్ధమని తెలంగాణ ఇంజనీర్లు చెపుతున్నారు. ఆ అవసరం రాకుండా తామే పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరిస్తే వ్యాప్కోస్‌‌‌‌తో డీపీఆర్‌‌‌‌ సిద్ధం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ ఈఎన్‌‌‌‌సీలు మురళీధర్‌‌‌‌, వెంకటేశ్వర్లు, ఏపీ హైడ్రాలజీ సీఈ రత్నకుమార్‌‌‌‌, తెలంగాణ ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌ సీఈ నర్సింహారావు, సాగర్‌‌‌‌ సీఈ నర్సింహా, సీతారామ ఎస్‌‌‌‌ఈ నాగేశ్వర్‌‌‌‌రావు, ఇంటర్‌‌‌‌స్టేట్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈ మోహన్‌‌‌‌కుమార్‌‌‌‌, రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు వెంకటరమారావు, సత్తిరెడ్డి, శ్యాంప్రసాద్‌‌‌‌రెడ్డి, భవానీరాం శంకర్‌‌‌‌, ఏపీ రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు రోశయ్య, బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి, రెహమాన్‌‌‌‌, సుబ్బారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొననున్నారు.

ఏపీ ప్రపోజల్​.. పోలవరం టు సాగర్‌‌‌‌

పోలవరం కుడి కాలువ ద్వారా సాగర్‌‌‌‌కు 2.50 టీఎంసీల నుంచి 3 టీఎంసీల నీళ్లను తరలించాలని ఏపీ ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పోలవరం నుంచి వైకుంఠాపురం రిజర్వాయర్‌‌‌‌, అక్కడ్నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నీళ్లను తరలిస్తారు. అక్కడ లిఫ్టు ఏర్పాటు చేసి సాగర్‌‌‌‌ టెయిల్‌‌‌‌పాండ్‌‌‌‌కు తరలిస్తారు. అక్కడి రివర్సబుల్‌‌‌‌ టర్బైన్ల ద్వారా నీటిని ఎత్తి ప్రాజెక్టులో పోస్తారు. పోలవరం నుంచి వీలైనంత ఎక్కువ నీటిని సాగర్‌‌‌‌ వరకు తరలించేలా ఏపీ ఇంజనీర్లు ప్రపోజల్స్‌‌‌‌ తయారు చేశారు.

తెలంగాణ ప్రపోజల్​ ఇట్లా..

గోదావరిపై కంతనపల్లికి 2 కిలోమీటర్ల దిగువన రాంపూర్‌‌‌‌ నుంచి పంప్ హౌజ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలి. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తి లక్నవరం చెరువులో పోయాలి. అక్కడ ఒక లిఫ్ట్‌‌‌‌ ఏర్పాటు చేసి ఎస్సారెస్పీ స్టేజ్–2లోని కాకతీయ కాల్వ 248 కిలోమీటర్​వద్ద పోయాలి. ఎస్సారెస్పీ కాల్వలోనే గ్రావిటీ ద్వారా 346 కి.మీ.ల వరకు నీటిని తీసుకెళ్తారు. అందుకు వీలుగా 8,500 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కాకతీయ కెనాల్​ను 24 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వీలుగా వెడల్పు చేస్తారు. అంటే 98 కిలోమీటర్ల పొడవునా 900 మీటర్ల వెడల్పుతో ఈ కాల్వ రీ డిజైన్​ చేస్తారు.  అక్కడ్నుంచి సూర్యాపేట వద్ద రిజర్వాయర్‌‌‌‌, భారీ పంపింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ ఏర్పాటు చేసి మూసీ రిజర్వాయర్‌‌‌‌, కట్టంగూరు మీదుగా నార్కట్‌‌‌‌పల్లి సమీపంలోని చెర్లపల్లి చెరువులో పోస్తారు. అక్కణ్నుంచి 60 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్​ ద్వారా బ్రాహ్మణ వెల్లెంల సమీపంలోని ఉదయసముద్రం రిజర్వాయర్‌‌‌‌కు తీసుకెళ్తారు. ఉదయసముద్రం మత్తడి ద్వారా హాలియా, అడవిదేవులపల్లి రిజర్వాయర్‌‌‌‌ ద్వారా నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్టుకు నీళ్లి ఎత్తిపోస్తారు. మూసీ దాటిన తర్వాత ఉదయ సముద్రం నుంచి మరో రూట్లో 90 కిలోమీటర్ల టన్నెల్‌‌‌‌ ద్వారా శ్రీశైలానికి ఒక టీఎంసీ నీటిని తరలించే ప్రపోజల్ రెడీ చేశారు. ఈ రూట్​లో 50 కిలోమీటర్ల టన్నెల్​ నిర్మించాల్సి ఉంటుంది. రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌, వైల్డ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ సాంక్చరీల మీదుగా భారీ కాల్వలు, టన్నెళ్లు తవ్వాల్సి ఉండటంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టే అవకాశముందని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.