
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో తుఫాన్ ముంచుకొస్తోందని హెచ్చరిస్తోంది.దీని ప్రభావంతో మరోమూడు రోజులు ఏపీలో పిడుగులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఇది తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు మోకా అని పేరు పెట్టారు. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కొనసాగుతున్న ద్రోణి
దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
తుఫాను హెచ్చరికలు జారీ
ఏపీలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు..ఆ తరువాత అకాల వర్షాలతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దాదాపు వారం రోజులుగా అకాల వర్షాలు ఏపీలోని పలుప్రాంతాల్లో ముంచెత్తుతున్నాయి. భారీగా పంట నష్టం జరిగింది. ఇదే సమయంలో మోకా తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు తప్పవని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
కంట్రోల్ రూంలు ఏర్పాటు
ప్రస్తుత సమాచారం మేర ఈ తుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. అల్పపీడనం ఏర్పడిన తదుపరి ఐఎండి సమాచారం మేరకు ఇతర వివరాలు తెలియజేస్తామన్నారు. ఏది ఏమైప్పటికీ అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఆదివారం ( మే7) నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు శనివారం (మే6)లోగా తిరిగి రావాలని కోరారు. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని ఐఎండీ అధికారులు విజ్ఞప్తి చేశారు