తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతోసమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 విస్తరిస్తున్న కారణంగా ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, డి–టైప్ సిలిండర్లు కూడా సిద్ధంచేశామని తెలిపారు. 56,741 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు..
డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు.. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామన్నారు. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇబ్బంది పడేవారికి అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ పరంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధంచేస్తున్నామన్నారు. పీఎస్ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ వేరియంట్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారని సీఎం జగన్ తెలిపారు. కొత్తవేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్కు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.