కరోనా చికిత్స కోసం మరో 54 ఆస్పత్రులు.. వెయ్యి కోట్ల నిధులు: సీఎం జగన్

కరోనా చికిత్స కోసం మరో 54 ఆస్పత్రులు.. వెయ్యి కోట్ల నిధులు: సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
క్రిటికల్‌ కేర్‌ చికిత్సకు అదనంగా 2380 బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్‌ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారామెడికల్‌ సిబ్బంది, వైద్యుల నియామకం, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ఇవికాకుండా కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 72,711కి చేరింది. అందుులో 884 మంది మరణించగా, 37555 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 34,272 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.