బెంగళూర్: సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగనున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ దూరమయ్యాడు. గాయం కారణంగా హేజిల్వుడ్ తొలి గేమ్ ఆడటం లేదని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ తెలిపాడు. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్కు ముందు శుక్రవారం (మార్చి 27) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫ్లవర్ మాట్లాడుతూ.. ఎస్ఆర్హెచ్తో జరగనున్న తొలి గేమ్ హేజిల్వుడ్ ఆడడని తెలిపారు. కానీ త్వరలోనే గ్రౌండ్ లోకి దిగేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడన్నారు.
‘‘హేజిల్వుడ్ జట్టులో చేరాడు. అతను ఫిట్గా కనిపిస్తున్నాడు. అతను తిరిగి డ్రెస్సింగ్ రూమ్లో ఉండటం, మా సమావేశాల్లో మళ్లీ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గాయం కారణంగా అతను తొలి మ్యాచ్కు సిద్ధంగా లేడు. కానీ మేము అతని ఫిట్నెస్ను నిశితంగా పర్యవేక్షిస్తాము. అతను త్వరలో ఐపీఎల్లోకి అడుగుపెట్టడం కోసం ఎదురుచూస్తున్నాం” అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న బౌలింగ్ యూనిట్ పట్ల మాకు నమ్మకం ఉందని.. యువ బౌలర్ రసిఖ్ గత ఏడాది కంటే మెరుగయ్యాడని తెలిపారు.
ఇండియా యువ పేసర్ మంగేష్ను జట్టులోకి తీసుకోవడం కూడా ఆనందంగా ఉందన్నాడు. అభినందన్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడని చెప్పారు. కాగా, వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే యశ్ దయాల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఎన్వోసీ రాకపోవడంతో నువాన్ తుషార తొలి మ్యాచ్ ఆడటం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ హేజిల్ వుడ్ కూడా తొలి మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం ఆర్సీబీకి ఎదురు దెబ్బే.
