ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల దూకుడు పెరుగుతుంది. ప్రజాక్షేత్రంలో అమీతుమీ తేల్చుకోవడానికి నేతలు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు నేడు (జులై4) భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన వైయస్ జగన్ చంద్రబాబు ని టార్గెట్ చేశారు.
చంద్రబాబు గతంలో 54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను అమ్మేశారని.. తన మనుషులకు తక్కువ ధరకు సంస్థలను కట్టబెట్టేశారని ధ్వజమెత్తారు. తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయంటూ.. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడని సెటైర్లు వేశారు జగన్. మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని చంద్రబాబు నమ్మకమని.. తన ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను అమ్మేసే చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు. పప్పు బెల్లాల కోసం అన్నీ చంద్రబాబు తన వారికి కట్టబెట్టారని.. చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాని నమ్ముకున్నారన్నారు. ఇప్పుడు పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. వెల్లూరు మెడికల్ కాలేజ్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. వెల్లూరు మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఈ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదన్నారు.
చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని దుయ్యబట్టారు. చిత్తూరు డెయిరీపై చంద్రబాబు కళ్లు పడ్డాయి. చంద్రబాబు హయాంలో అన్యాయంగా చిత్తూరు డెయిరీని మూసేశారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా. 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం. అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది అని సీఎం జగన్ పేర్కొన్నారు.