జగనన్న ఆరోగ్య సురక్షపై కలెక్టర్లతో సీఎం సమీక్ష.. పేషెంట్లకు చేయూతనివ్వాలని ఆదేశం

జగనన్న ఆరోగ్య సురక్షపై కలెక్టర్లతో సీఎం సమీక్ష.. పేషెంట్లకు చేయూతనివ్వాలని ఆదేశం

జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్  క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌  సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు .  గ్రామ,  వార్డు సచివాలయాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందని సీఎం జగన్ తెలిపారు.  వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించడంతో పాటు అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వాళ్ల విషయంలో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికారుకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. వైద్య శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూత నివ్వడం చాలా ముఖ్యమని వారికి సూచించారు.శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందని చెప్పారు.

 ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నయం అయ్యేంత వరకూ చేదోడుగా వాదోడుగా  ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అర్బన్‌ ఏరియాల్లో 91 శాతం, రూరల్‌ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్‌ పూర్తయ్యిందని.. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్‌ పూర్తిచేశారన్నారు. 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారని.. జగనన్న సురక్ష యాప్‌లో క్యాంపులకు వచ్చే వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నామన్నారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలన్న దానిపై డేటా ఉంటుందన్నారు. జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రెండు గంటలకు పైగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. నవంబర్‌ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.