ఏపీ అసెంబ్లీలో సోమవారం మద్యం పాలసీపై చర్చ జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి… మద్య నిషేధం, మద్యం అమ్మకాలు, షాపుల అద్దెల పై గురించి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. మద్యపాన నిషేధంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దాన్ని ఎత్తేశారన్నారు.
చంద్రబాబు పాలసీ మద్యం తాగు, తాగించు
ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినా, అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దాన్ని అమలు చేయలేదన్నారు నారాయణ స్వామి. టీడీపీ హయాంలో మద్యం ఏరులుగా పారిందని, మద్యం టెండర్లను ప్రైవేటు వ్యాపారస్ధుల చేతికిచ్చారన్నారు. మద్యం తాగు.. తాగించు ఇదీ చంద్రబాబు పాలసీ అని మంత్రి అన్నారు. మద్యం మాను.. మాన్పించు ఇదీ జగన్ పాలసీ అని ఆయన వ్యాఖ్యానించారు..
మద్యం టెండర్లలో 80 శాతం టీడీపీ వాళ్లవే
మద్యపానాన్ని నిషేధించాలన్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా , ఒక సంకల్పంతో ఈ నిషేధాన్ని ముందుకు తీసుకురావాలని వైయస్సార్ పార్టీ వాళ్లు ఎవరూ కూడా టెండర్లు వేయడానికి ముందుకు రాలేదన్నారు. దాదాపు 80 శాతం తెలుగుదేశం వాళ్లే టెండర్లు వేశారని డిప్యూటీ సీఎం అన్నారు. విశాఖపట్నంలో టీడీపీ మద్ధతుదారులు టెండర్లు వేశారన్నారు.
మూడు నెలల్లో మద్యం వినియోగం తగ్గింది
ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో మద్య వినియోగం 48.33 శాతం తగ్గిందని, ఇది క్రమేపీ తగ్గుతూ ఆగష్టులో మైనస్ 2.5 శాతం తగ్గిందన్నారు నారాయణ స్వామి. మద్యపానాన్ని దశలవారీగా తగ్గించాలన్న లక్ష్యంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం షాపులు తగ్గించారన్నారు. గతంలో 4380 షాపులు ఉండగా… దాన్ని 20శాతం తగ్గిస్తూ 3500 షాపులకు కుదించారని నారాయణ తెలిపారు.