పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ మరమ్మతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల 20 కోట్ల రూపాయిలను మంజూరు చేసింది. సీడబ్ల్యూసీ, ఎన్హెచ్పీసీ సిఫారసుల మేరకు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్వాల్కు రిపేర్ చేయనున్నారు. అక్టోబర్ లో గోదావరి నదికి భారీగా వరద చేరేఅవకాశం ఉన్నందున ఆలోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. 2019,2020లో సంభవించిన భారీ వరదల కారణంగా డయాఫ్రమ్వాల్ దెబ్బతినడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది.
జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), ఐఐటిల నిపుణులు పోలవరం ప్రాజెక్ట్ లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను ఎలా మరమ్మతులు చేయాలో పరిశోధనలు చేశారు. నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) బృందం మరమ్మతు చేసే ప్రక్రియను నివేదించింది.డ్యామ్ డిజైన్స్ రివ్యూ ప్యానెల్ (DDRP), జల్ శక్తి మంత్రిత్వ శాఖ (CWC), NHPC నివేదికను పరిశీలించాయి . NHPC సిఫార్సు చేసిన విధంగా మరమ్మతులు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి.
NHPC సలహా ప్రకారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విభాగాన్ని మరమ్మతు చేయడానికి 331 కోట్ల రూపాయిల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని కవర్ చేయడానికి ఒప్పందంలో భాగంగా, కేంద్రం నిధులు ఇచ్చేలా చూసుకోవాలని ఆయన ప్రాజెక్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనపు నిర్వహణ పనులు, కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు 17 వందల కోట్ల రూపాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
