
- నాలుగు నెలలైనా రీస్టోరేషన్ పనులు చేపట్టని పొరుగు రాష్ట్రం
- పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చిచెప్పిన ఎన్జీటీ
- ఇప్పటికే డీపీఆర్కు మించి పనులు చేసినట్టు తేల్చిన జాయింట్ కమిటీ
- ప్రాజెక్టు సైట్ను వెంటనే పూర్వ స్థితికి తీసుకురావాలని పర్యావరణ శాఖ ఆదేశం
- ఫిబ్రవరిలోనే ఆదేశాలు..అయినా నో యాక్షన్
- ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరోసారి తెలంగాణ లేఖ
- వెంటనే రీస్టోరేషన్ పనులు చేపట్టే లాఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ మొండిగా వ్యవహరిస్తున్నది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చివాట్లు పెట్టినా.. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలిచ్చినా పట్టించుకోవడం లేదు. డీపీఆర్ (డిటెయిల్డ్ప్రాజెక్టు రిపోర్టు) పేరుతో ప్రాజెక్టు పనులు చేపట్టి ఏపీ పర్యావరణ విధ్వంసానికి పాల్పడింది. దీంతో ఆ పనులను వెంటనే ఆపాలని ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. మరోవైపు ప్రాజెక్టు సైట్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చేసి, ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆదేశించింది. ఈఏసీ ఆదేశాలిచ్చి నాలుగు నెలలవుతున్నా ఏపీ ఇప్పటికీ రీస్టోరేషన్పనులు చేపట్టలేదు. దీంతో ఏపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ అధికారులు మరోసారి లేఖ రాశారు. రీస్టోరేషన్పనులు చేపట్టేలా ఏపీని ఆదేశించాలని కోరారు.
మూడుసార్లు ఈఏసీ మీటింగ్..
రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వెంటనే ఆపేయాలంటూ 2021 డిసెంబర్17న ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టరాదని తేల్చి చెప్పింది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు పొందిన తర్వాతే పనులు చేయాలని సూచించింది. అంతేకాదు.. అక్కడ ఎంత వరకు పనులు జరిగాయో తేల్చేందుకు జాయింట్కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2024 మార్చి 22న రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టుపై 2024 నవంబర్నుంచి 2025 ఫిబ్రవరి వరకు కేంద్రం మూడుసార్లు ఈఏసీ మీటింగ్ నిర్వహించింది. 2024 నవంబర్5న, 2025 జనవరి 10న, 2025 ఫిబ్రవరి 27న ఈఏసీ మీటింగ్స్ జరిగాయి. ప్రాజెక్ట్ సైట్లో డీపీఆర్కు మించి పనులు జరిగాయని, ఆ ప్రాంతాన్ని వెంటనే పూర్వ స్థితికి తీసుకురావాలని ఫిబ్రవరిలో జరిగిన మీటింగ్లో ఏపీకి ఈఏసీ ఆదేశాలిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాలని, మట్టి తవ్వకాల పనులు జరిగితే పూడ్చే యాలని, గ్రీన్కవర్ పెంచాలని స్పష్టం చేసింది. ఆయా పనులకు ఆధారంగా వీడియో డాక్యుమెంట్ కూడా సమర్పించాలని తేల్చి చెప్పింది.
రీస్టోరేషన్ పనులు నిల్..
రీస్టోరేషన్ పనులు వెంటనే చేపట్టాలని ఈఏసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏపీ మాత్రం ఇప్పటికీ పనులు మొదలుపెట్టలేదు. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను తొలగించలేదు. తవ్విన కాల్వలు, అప్రోచ్ చానెళ్లను పూడ్చలేదు. గ్రీన్కవర్ పెంచే ప్రయత్నాలూ చేయలేదు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వం ఉండడంతోనే ఏపీ ఇలా మొండివైఖరి ప్రదర్శిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తామేం చేసినా చెల్లుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఏపీ వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కృష్ణా నీళ్ల పంచాయితీపై ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగుతున్నా.. ఏపీ మాత్రం తమను అడిగే వాళ్లెవరు? అన్న రీతిలో వ్యవహరిస్తున్నదని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వస్తాయని, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుకూ అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసన్న రీతిలో ఏపీ తీరున్నదని చెబుతున్నారు.
సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎట్ల చెల్లుతది?
జాయింట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. ఇప్పటికే పంప్హౌస్ పనులు 87 శాతం, అప్రోచ్ చానెల్పనులు 14.14 శాతం వరకు పూర్తయ్యాయి. అయితే, డీపీఆర్కు మించి ఏపీ పనులు చేసినా.. పనులకు సంబంధించి ఏపీ నుంచి సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకుంటామని ఈఏసీ మీటింగ్లో పేర్కొన్నారు. మీటింగ్ మినిట్స్లోనూ అదే అంశాన్ని పెట్టారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ చేపడుతున్న రాష్ట్రం నుంచే ఆ ప్రాజెక్ట్ పనులపై ఎలా సెల్ఫ్ సర్టిఫికేషన్తీసుకుంటారని పర్యావరణ శాఖను ప్రశ్నించింది. వెంటనే మినిట్స్ నుంచి దాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది. రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి రీస్టోరేషన్ పనులు చేపట్టకుండా ఏపీ ఆలస్యం చేస్తున్నదని, వెంటనే ప్రాజెక్ట్సైట్ను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా ఏపీకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిరోజూ అక్కడ జరుగుతున్న పనులపై పర్యావరణ శాఖ అధికారులు లేదా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆఫీసర్లు పర్యవేక్షించాలని.. ఏరోజుకారోజు పనులపై కంప్లయన్స్ రిపోర్టును ఎన్జీటీకి ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీనిపై వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేసింది.