సీట్ల కోసమా.. నోట్ల కోసమా... చంద్రబాబు.. పవన్​ భేటీపై అంబటి సెటైర్లు

సీట్ల కోసమా.. నోట్ల కోసమా... చంద్రబాబు.. పవన్​ భేటీపై అంబటి సెటైర్లు

వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ - జనసేన మధ్య సీట్ల పంపకంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వాళ్లు సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను డిమాండ్‌ చేశారు


టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై వైసీపీ నేతలు స్పందించడం మొదలుపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని అన్నారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని.. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని అంబటి అన్నారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. 

జనసేన టీడీపీ సీట్ల పంపకం  తేలేది కాదు.. మునిగేది కాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉందని, త్వరలో యుద్ధం కూడా అయిపోబోతోందని మంత్రి చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చేదాకా కూడా వారు సీట్ల గురించి తేల్చుకోలేరని మంత్రి అంబటి విమర్శించారు. చంద్రబాబు పవన్‌కల్యాణ్‌కి ఇచ్చేది ముష్టి మూడో, ముప్పయ్యో, ఇరవై ఐదో అంటూ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. సీట్లేమో ముష్టిలా ఇస్తారు.. క్యాష్‌ మాత్రం బలంగా ఇస్తారంటూ మంత్రి విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ ని నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని ఆరోపించారు.