
హైదరాబాద్, వెలుగు: జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్లోని షెడ్యూల్–-2లో పొందుపరిచిన అన్ని ప్రాజెక్టులను తమ నిర్వహణకు అప్పగించాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను గోదావరి బోర్డు కోరింది. గురువారం నిర్వహించే జీఆర్ఎంబీ సబ్ కమిటీ ఏడో మీటింగ్ ఎజెండాలో ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని చేర్చింది. ఆయా ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ సవ్యంగా సాగేందుకు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బోర్డుకు బదలాయించాలని సూచించింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీ డిపాజిట్ చేయాలని తెలిపింది. రెండు రాష్ట్రాల్లో నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుల రిపేర్లు ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జలసౌధలో జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, సబ్ కమిటీ కన్వినర్ అజగేషన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
అప్పగించమన్న ప్రాజెక్టులు ఇవి
గోదావరిపై తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న కాకతీయ కెనాల్పై ఏర్పాటు చేసిన గీసుగొండ క్రాస్ రెగ్యులేటర్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ, మెయిన్ పంప్ హౌస్ కన్నెపల్లి, దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్హౌస్, దుమ్ముగూడెం నావిగేషన్ కెనాల్ అప్పగించాలని గోదావరి బోర్డు కోరింది. దీంతో పాటు ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కామన్ ప్రాజెక్టుగా ఉన్న మచ్కుండ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, ఏపీ, తెలంగాణ మధ్య గల సీలేరు పవర్ కాంప్లెక్స్ కూడా ఇవ్వాలని తెలిపింది. ఏపీలో ధవళేశ్వరం బ్యారేజీ, పుష్కర, తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు, వెంకటనగరం కొత్త, పాత ఎత్తిపోతల పథకాల పంప్హౌస్లు తమ నిర్వహణకు అప్పగించాలంది.