
- ఒక్క ఆగస్టులోనే పోతిరెడ్డిపాడు నుంచి 81 టీఎంసీల తరలింపు
- శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తంగా 165 టీఎంసీల దాకా తరలింపు
- నాగార్జునసాగర్ నుంచి 102.5 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ వినతి
- డిసెంబర్ దాకా సాగుకు 88.50 టీఎంసీలు.. తాగునీటికి 14 టీఎంసీలు అవసరమవుతాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు:
ఏపీ జలదోపిడీని పీక్స్కు చేరుస్తున్నది. ఎలాంటి ఇండెంట్ పెట్టకుండానే శ్రీశైలం నుంచి విచ్చలవిడిగా నీటిని తరలించుకుపోతున్నది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే నిర్మించుకున్న ఆఫ్లైన్ రిజర్వాయర్లను నింపేసుకుంటున్నది. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా లిఫ్ట్ స్కీమ్ల ద్వారా దాదాపు 165 టీఎంసీల వరకు నీటిని మళ్లించుకున్నది. జులై 7న పోతిరెడ్డిపాడు నుంచి 5 వేల క్యూసెక్కులతో నీటి మళ్లింపులను మొదలుపెట్టిన ఏపీ.. ఇప్పుడు దాన్ని మరింత పీక్స్కు తీసుకెళ్లింది.
రోజూ 30 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడు ద్వారానే తోడేస్తున్నది. ఈ పోతిరెడ్డిపాడు ద్వారానే ఏపీ ఇప్పటిదాకా దాదాపు 150 టీఎంసీలు తరలించినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టులో దోపిడీ మరింత హైట్స్కు చేరింది. ఆ నెల మొత్తంగా 80.86 టీఎంసీలను ఏపీ తీసుకెళ్లిపోయింది. ఆ నెలలో తొలి 8 రోజులు వరుసగా రోజూ 3.18 టీఎంసీలను మళ్లించింది. ఈ నెల 9న 2.97 టీఎంసీలు, 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 2.9 టీఎంసీలు, 14, 15వ తేదీల్లో 1.82 టీఎంసీలు, 16న 2.30 టీఎంసీలు, 17 నుంచి 27వరకు రోజూ 11 రోజులపాటు 2.72 టీఎంసీలు, ఆ తర్వాత రెండు రోజులు 2.5 టీఎంసీల చొప్పున నీటిని ఏపీ మళ్లించింది.
ఇక, ఈ నెలలో పది రోజుల్లోనే 28 టీఎంసీలను మళ్లించగా.. గత ఆరు రోజులుగా 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి నీటిని డ్రా చేస్తుండడం గమనార్హం. ఈ నీటిని అంతటినీ ఏపీ ఎలాంటి ఇండెంట్ పెట్టకుండానే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పట్టుకెళ్లిపోతుండడం కలవరపరిచే విషయం. రాబోయే రోజుల్లో ఏపీ జలదోపిడీ మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అదే సమయంలో శ్రీశైలం నుంచి మనం తీసుకున్న జలాలు కనీసం 5 టీఎంసీలు కూడా మించలేదు.
102.5 టీఎంసీలు కావాలి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద సాగు, తాగునీటి అవసరాల లెక్కలను అధికారులు తేల్చారు. డిసెంబర్ వరకు 102.5 టీఎంసీలు అవసరమవుతాయని స్పష్టం చేశారు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా 70 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ నుంచి 32.5 టీఎంసీలను తీసుకోవాల్సి ఉంటుందని లెక్కతీశారు. అందులో సాగుకు 88.50 టీఎంసీలు, తాగునీటికి 14 టీఎంసీలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు కేటాయింపులను చేయాల్సిందిగా కృష్ణా బోర్డుకు అధికారులు లేఖ రాశారు.
నెలవారీ అవసరాలతో ఇండెంట్ పెట్టారు. ఇటు సాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 26.715 టీఎంసీల నీటిని వినియోగించుకున్నదని పేర్కొన్నారు. ఎడమ కాల్వ నుంచి 15.517 టీఎంసీలు, ఏఎమ్మార్పీ నుంచి 11.198 టీఎంసీలను తీసుకున్నట్టు తెలిపారు. అదే సమయంలో ఏపీ సాగర్ కుడి కాల్వ నుంచి 22.73 టీఎంసీలు, ఎడమ కాల్వ నుంచి 5.30 టీఎంసీలు కలిపి మొత్తం 28.03 టీఎంసీలు తీసుకున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో డెడ్స్టోరేజ్కు పైన 178.59 టీఎంసీల నీళ్లున్నాయని, శ్రీశైలంలో డెడ్స్టోరేజ్కు ఎగువన 157.62 టీఎంసీల జలాలు వాడుకోవడానికి అందుబాటులో ఉన్నాయని
పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ నుంచి నెలవారీగా నీటి అవసరాలు (టీఎంసీల్లో)
ప్రాజెక్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మొత్తం
సాగు తాగు సాగు తాగు సాగు తాగు సాగు తాగు
లెఫ్ట్ కెనాల్ 18.5 1.5 19.5 1.5 16 1.5 10 1.5 70
ఏఎమ్మార్పీ 6.5 2 6.5 2 6.5 2 5 2 32.5
మొత్తం 25 3.5 26 3.5 22.5 3.5 15 3.5 102.5