బీసీసీఐ సెలక్టర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సెలక్టర్ పోస్టుల కోసం మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 28న దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో చివరగా నయన్ మోంగ్యా, మనీందర్ సింగ్, శివ్ సుందర్ దాస్, అజయ్ రాత్రా అప్లై చేసుకున్నట్లు సమాచారం.
మోంగియా ఒక్కడే..
సెలక్టర్ పోస్టు కోసం ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వారిలో నయన్ మోంగ్యా ఒక్కడే.... జూనియర్, సీనియర్ స్థాయుల్లో సెలెక్టర్గా పనిచేశాడు. ఇతనితో పాటు.. శివ సుందర్ దాస్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. శివ గతంలో భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా విధులు నిర్వర్తించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలోనూ సేవలందించాడు. అయితే సెలెక్షన్ ప్యానెల్లో ఈస్ట్ నుంచి ఉన్న దేబాషిష్ మొహంతీ స్థానంలో దాస్ను ఎంపిక చేసే ఛాన్సుంది.
బదానీకి అవకాశం లభిస్తుందా..?
అటు సౌత్ నుంచి సెలెక్షన్ కమిటీలో రిప్రజంటేషన్ కోసం హేమంగ్ బదానీ దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బదానీ సన్రైజర్స్ హైదరాబాద్కు ఫీల్డింగ్ కోచ్గా ఉన్నాడు. అయితే ప్రస్తుతం బీసీసీఐ వేటు వేసిన చేతన్ శర్మ కమిటీలో దేబాశిష్ మొహంతీ తప్ప మిగతా వాళ్లు మళ్లీ ఈ పోస్టుల కోసం మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కానీ వారి దరఖాస్తులను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. పరిగణలోకి తీసుకోకుంటే మాత్రం సౌత్ నుంచి బదానీకి అవకాశం లభించొచ్చు. మరోవైపు కొత్తగా అప్లై చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేయడం కోసం బీసీసీఐ ప్రత్యేకంగా క్రికెట్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయనుంది.
ఫస్ట్ టాస్క్..
మరోవైపు కొత్తగాఎన్నికయ్యే సెలక్షన్ ప్యానల్ కు జనవరిలో కొత్త టాస్క్ ఎదురవనుంది. జనవరిలో టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లలో పాల్గొననుంది. లంకతో మూడు వన్డేలతో పాటు..మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ల కోసం కొత్త సెలక్షన్ ప్యానల్ టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉంటుంది.