నల్గొండ, వెలుగు: సాదాబైనామా కింద కొన్న భూమిని అప్రూవ్ చేయించుకునేందుకు వచ్చిన ఓ బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్పై బాధితుడు నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ మండలం సందెనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని అప్రూవల్ చేయాలంటూ తహసీల్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నాడు.
డీటీ విజయ శేఖర్, సదరు బాధితుడి నుంచి డబ్బులు గుంజాలని ప్లాన్ చేశాడు. ఆఫీసులో పనిచేసే జీపీవో లచ్చయ్యను మధ్యవర్తిగా పెట్టుకొని, డబ్బులు ఇస్తేనే పని చేస్తానంటూ బాధితుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితుడు కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆయన.. తహసీల్ ఆఫీస్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ట్రైనీ కలెక్టర్ను ఆదేశించారు.
జీపీవో సరెండర్.. డీటీపై విజిలెన్స్ ఎంక్వయిరీ
ప్రాథమిక విచారణలో అక్రమాలు నిజమేనని తేలడంతో.. డీటీ విజయ శేఖర్, జీపీవో లచ్చయ్యలపై శాఖాపరమైన విచారణ జరపాల్సిందిగా తహసీల్దార్ను ట్రైనీ కలెక్టర్ ఆదేశించారు. దీంతో జీపీవోను సరెండర్ చేశారు. మరోవైపు, ఈ అక్రమాల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్పై తాను స్వయంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఫిర్యాదు చేయనున్నట్లు ట్రైనీ కలెక్టర్ స్పష్టం చేశారు.
