పురావాస్తు శాఖ మాజీ చీఫ్ బీబీ లాల్ క‌న్నుమూత‌

పురావాస్తు శాఖ మాజీ చీఫ్ బీబీ లాల్ క‌న్నుమూత‌

భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ బీబీ లాల్‌(101 ) కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా  తెలిపారు. దేశంలో పురాత‌త్వ ప‌రిశోధ‌న‌ల‌కు బీబీ లాల్ విశేష సేవ‌లు అందించార‌ని కొనియాడారు. గ‌త 4 ద‌శాబ్ధాలుగా యువ ఆర్కియాల‌జిస్టుల‌కు శిక్షణ ఇచ్చారని కిషన్‌రెడ్డి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.   బీబీ లాల్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ  విచారం వ్యక్తం చేశారు. బీబీ లాల్ ది అద్భుతమైన వ్యక్తిత్వమని, పురావస్తు శాస్త్రానికి ఆయన చేసిన కృషి అసమానమైనదని మోడీ ట్వీట్ చేశారు.  

బీబీ లాల్‌ను భార‌త ప్రభుత్వం 2021లో ప‌ద్మ విభూష‌ణ్‌తో స‌త్కరించింది. బాబ్రీ మ‌సీదు ఉన్న  స్థానంలోనే రామ మందిరం ఉండేద‌ని బీబీ లాల్ త‌న ప‌రిశోధ‌న‌ల్లో ర‌చించారు. ఆ ప‌రిశోధ‌న ర‌చ‌న‌ల ఆధారంగానే సుప్రీంకోర్టు రామ మందిర ఆల‌య నిర్మాణానికి అనుకూల తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 1921లో జన్మించిన లాల్...  1968 నుంచి 1972 మధ్య ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.