
మనిషి ఆనందంగా జీవించడం, ప్రతి మలుపుని ఆస్వాదించడమే జీవిత పరమార్ధం. దీనికి ఏ మాయ, మంత్రం లేదు. కానీ, గత కాలపు చేదు జ్ఞాపకాలు, రేపటి కోసం పరుగులు ఆనందాన్ని ఆమడ దూరంలో ఉంచుతున్నాయి. చక్రాన్ని కనుక్కున్న తర్వాత పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనది. అనంతరం ప్రపంచ చరిత్రలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర సాంకేతికలు ఊపందుకున్నాయి. జీవితాన్ని సుఖమయం చేశాయి. విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో పెను మార్పులు వచ్చాయి. మానవ జీవన ప్రమాణాలు పెరిగాయి. ఇటీవల మొదలైన నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని శాసిస్తోంది.
ఇంకా ఆ హోదాలు ఎందుకు?
ఆవిష్కరణలు ఎన్ని వచ్చినా ఈ ప్రకృతిలో జరిగే క్షణకాల ప్రమాదాలను ఆపలేకపోతున్నాము. కేవలం వాటి తీవ్రతను మాత్రమే అరికట్టగలుగుతున్నాము, ఇంకా పరిష్కారాలు అన్వేషిస్తున్నాం. ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మొన్న వేసవి విడిదికి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వెళ్ళిన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. నిన్న రాయల్ చాలెంజ్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమంలో అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వెళ్లిన 11 మంది విగత జీవులుగా మారారు. నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మరియు 33 బిజే వైద్య కళాశాల విద్యార్థులు చనిపోయారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆనందంగా తన గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన విమాన ప్రయాణికులు ఊహించని లోకానికి వెళ్లారు. అందరితో కలిసి భోజనం చేస్తున్న వైద్య కళాశాల హాస్టల్ విద్యార్థులు ముద్ద నోట్లో ఉండగానే మంటల్లో మాడిపోయారు. అసలు కనురెప్పపాటులో జరిగే ఈ ప్రమాదాలు ఎందర్నో కలిచివేశాయి.
కరోనా సమయంలోనైతే లక్షల మరణాలు సంభవించాయి. మనిషి పుట్టుకకు సమయం తెలిసివస్తుందేమో, కానీ చావు ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినా మనిషి నిరంతరం మానసిక సంఘర్షణలు, కలహాలతో బతుకుతున్నాడు. హోదాలు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించలేకపోయాయి. సైన్స్ అభివృద్ధి చేసిన డిఎన్ఏ పరీక్ష మృతదేహాలను గుర్తించి ఆ కుటుంబాలకు అప్పచెప్పారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడినీ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఆధునిక ఆయుధాలతో తిప్పి కొట్టారు. మరి మనిషేమో ఇరుకైన సాంప్రదాయ అనాగరిక జీవితంలోనే బ్రతుకుతున్నాడు.
ప్రేమతో ఆనందంగా జీవిద్దాం
భారత్ లో జరిగిన ఈ వరుస ప్రమాదాలు, ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్-, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధాలతో సామాన్యులు బలి కావడం, ఎందరో నిరాశ్రయులుగా మిగలడంతో ఒకసారి మన జీవితాల్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఎక్స్ వేదికలో రాసిన వాక్యాలు ఆలోచింపజేశాయి. ఎన్నో జీవితాలు ఒక్క క్షణంలో మాయమైపోతాయి.
జీవితం వాగ్దానం చేయలేదు. ఇది అరువు తెచ్చుకున్నది మాత్రమేనని గుర్తుంచుకోండి. కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండండి, రేపు వస్తుందని హామీలేదనే ఆయన పోస్ట్ జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. మానవుడు కనుక్కున్న సైన్సు మనల్ని ఎంత బలవంతుణ్ణి చేస్తుందో అదే సైన్స్ మనల్ని బలహీనులను కూడా చేస్తుంది. ఎందుకంటే నేడు మనుషులు సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకున్నారు.
దీంతో కుటుంబం, సమాజాన్ని మరిచిపోతున్నాం. పక్కింటి వారెవరో కూడా తెలియని పరిస్థితి. అంత బిజీ లైఫ్ లో మానవ సంబంధాలు రోజు రోజుకు బలహీనపడుతున్నాయి. మనిషి కృత్రిమ ఆనందానికే పరిమితం అయ్యాడు. భారతదేశం ఆర్థికంగా 4వ స్థానంలో ఉన్నా...సంతోషంలో 118 వ స్థానంలోనే ఉంది. కావున ఆనందంగా జీవించాలంటే సామాజిక సంబంధాలతో, దాతృత్వం కలిగి జీవించాలి.
-సంపతి రమేష్ మహారాజ్,సోషల్ ఎనలిస్ట్-