కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ను తొలగించారు. ఆయన స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ ను న్యాయశాఖ మంత్రిగా నియమించారు. కిరణ్ రిజీజుకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన రిలీజ్ చేసింది. 2021 జులై నుంచి కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు.
గత కొన్ని రోజులుగా కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కొలీజియం ద్వారా న్యాయమూర్తులను ఎన్నుకోవద్దని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకానికి ఇంతకంటే మంచి మార్గం లేదని సుప్రీం స్పష్టం చేసింది.
అంతేగాకుండా కిరణ్ రిజిజు ఇటీవల సుప్రీం కొలిజీయం వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కొంత మంది రిటైర్డ్ న్యాయమూర్తులు భారత వ్యతిరేక ముఠాలో భాగమయ్యారని వ్యాఖ్యానించారు. దీనిపై పలు హైకోర్టులతో సహా 300 మందికి పైగా న్యాయవాదులు తప్పుబట్టారు. కిరణ్ రిజిజు తన వ్యాఖ్యలను బహిరంగంగా వెనక్కి తీసుకోవాలని ..భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని డిమాండ్ చేశారు.