న్యూఢిల్లీ: ఇండియా షట్లర్లు ఎంఆర్ అర్జున్–హరిహరన్ జోడీ.. ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్–300 టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో అర్జున్–హరిహరన్ 26–24, 21–14తో అలెగ్జాండర్ డున్–ఆడమ్ ప్రింజిల్ (స్కాట్లాండ్)పై గెలిచారు. 35 నిమిషాల మ్యాచ్లో ఇండియా ద్వయానికి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా తట్టుకున్నారు.
ఆరంభం నుంచి రెండు జంటలు పాయింట్ల కోసం శ్రమించడంతో తొలి గేమ్ ఉత్కంఠభరితంగా సాగింది. 10–10 నుంచి 23–23 వరకు స్కోరు సమంగా ముందుకెళ్లింది. ఈ దశలో స్కాట్లాండ్ జోడీ ఒక్క పాయింట్ నెగ్గి ఆధిక్యంలో నిలవగా, అర్జున్ ద్వయం వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో వ్యూహాత్మకంగా ఆడిన ఇండియన్ ప్లేయర్లు డున్–ప్రింజిల్కు కోలుకునే చాన్స్ ఇవ్వలేదు.
దాంతో 4–4 స్కోరు తర్వాత అర్జున్ జోడీ వెనుదిరిగి చూసుకోలేదు. విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో తన్వీ శర్మ 21–14, 21–17తో అన్మోల్ ఖర్బ్పై గెలిచింది. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో తెలంగాణ షట్లర్ తరుణ్ మన్నెపల్లి 18–21, 21–14, 21–23తో వాంగ్ జు వీ (చైనీస్తైపీ) చేతిలో పోరాడి ఓడాడు.
