మేము దాడులు చేస్తే బీజేపీ తట్టుకుంటదా..?

మేము దాడులు చేస్తే బీజేపీ తట్టుకుంటదా..?

తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే బీజేపీ బతుకులు ఆగం అవుతాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడాన్ని ఆయన ఖండించారు. దొంగే దొంగ అన్నట్లుగా వాళ్లే దాడి చేస్తారు..వాళ్లే దీక్షలు చేస్తారని విమర్శించారు. టీఆర్ఎస్ దాడులకు పాల్పడితే బీజేపీ తట్టుకుంటుందా అని ప్రశ్నించారు. బీజేపీ తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తాము కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇళ్లపై దాడులు చేయాల్సి వస్తదని హెచ్చరించారు. 

కవితను ఇబ్బందులకు గురిచేసి.. కేసీఆర్ ను రాష్ట్రానికే పరిమితం చేసు కుట్రలు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో నేతలంతా ప్రజల్లోంచి వచ్చారని..లిక్కర్ స్కాం కేసులో ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని కవిత ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ 8 ఏళ్ల కాలంలో 22వేలకు పైగా ఈడీ, ఐటి కేసులు నమోదు అయ్యాయని..స్వాతంత్య్రం వచ్చిన్నప్పటి నుంచి జరగని ఈడీ సోదాలు మోడీ పాలనలో జరుగుతున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను చీల్చడానికే కేంద్రం ఈడీ, ఐటి, సీబీఐ లను వాడుతోందన్నారు. మోడీ ఈడీ, అమిత్ షా ఐటీ ఇజంకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.