
ఐదు కేటగిరీల్లో ఉద్యోగాలు
కరీంనగర్ టౌన్, వెలుగు: ఆర్మీలో చేరే అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇక్కడి అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కల్నల్ పవన్పురితో కలిసి గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల యువత ర్యాలీలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు www.joinindianarmy.nic.in లో ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
నమోదు చేసుకున్న వారిని మాత్రమే ర్యాలీకి అనుమతిస్తారన్నారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ ఫార్మా ఇలా ఐదు కేటగిరీల్లో ఉద్యోగ అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లాల వారీగా రోజుకు మూడు నుంచి నాలుగు వేల మందికి రన్నింగ్, ఫిజికల్ టెస్ట్ , ఫిజికల్ కొలతలు, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అర్హత సాధించిన వారికి తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ ఆఫీస్ వారు రిటన్ ఎగ్జామ్ నిర్వహిస్తారని తెలిపారు.