కర్ణాటక నుండి అక్రమంగా డిఫెన్స్ మద్యాన్ని హైదరాబాద్కి తీసుకొని వచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రసూల్పురకి చెందిన అన్నపురెడ్డి వెంకట కృష్ణారెడ్డి పోలీస్ శాఖలో హోం గార్డుగా పని చేస్తున్నాడు.
ఆయన సోదరుడు అన్నపురెడ్డి శ్రీనివాస రెడ్డితో కలిసి ఎక్స్ సర్వీస్ మెన్ నుండి డిఫెన్స్ మద్యం తక్కువకు కొనుగోలు చేసి, బయట ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ఇందుకు పోలీస్ శాఖలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణలో, కర్ణాటకలో సచిన్ అనే వ్యక్తి నుండి డిఫెన్స్ మద్యం కొనుగోలు చేసేవాడు.
ఇదే క్రమంలో తన ఇంటికి తన ఇంటికి తరలిస్తున్న సమయంలో, పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు ఆ ఇద్దరిని తనిఖీ చేశారు. వారి నుంచి కర్ణాటకకు చెందిన 63 డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో తనిఖీ నిర్వహించగా తెలంగాణకు చెందిన మరో 32 డిఫెన్స్ మద్యం బాటిళ్లు లభించాయి. దాంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి జులై 24న రిమాండ్ కి తరలించారు.