
పుణె వేదికగా నిన్న రాత్రి జరిగిన భారత్, శ్రీలంక రెండవ టీ20లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ చెత్త రికార్డ్ నెలకొల్పాడు. నిన్న దారుణంగా విఫలం అయిన అర్ష్దీప్, మ్యాచ్ లో రెండు ఓవర్లే వేసి 37 పరుగులు ఇచ్చుకున్నాడు. రన్స్ ఇచ్చిన విషయం పక్కన పెడితే.. వేసిన రెండు ఓవర్లలో మొత్తం 5 నో బాల్స్, దాంట్లో వరుసగా హ్యాట్రిక్ నో బాల్స్ వేసి చెత్త రికార్డ్ లిఖించుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నోబాల్స్ (14) వేసిన ఆటగాడిగా, హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన తొలి భారత బౌలర్ గా చెత్త రికార్డ్ నెలకొల్పాడు. అర్ష్దీప్ తర్వాత స్థానంలో టీమిండియా బౌలర్ బుమ్రా (8 నో బాల్స్) ఉన్నాడు.
నిన్న జరిగిన మ్యాచ్ లో భారత బౌలర్లు మరొక సారి తేలిపోయారు. వైడ్లు, నో బాల్స్ వేస్తూ ఎక్స్ ట్రాలు సమర్పించుకున్నారు. ఫస్ట్ టీ20 హీరో శివమ్ మావీ 53 రన్స్, ఉమ్రాన్ మాలిక్ 48 రన్స్ ఇచ్చుకున్నారు. అక్షర్ పటేల్ మినహా బౌలింగ్ చేసిన ఏ బౌలర్ పరుగుల వరదని ఆపలేకపోయారు.