
మలయాళ ఫిల్మ్ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. కాలు వాపు కారణంగా గత రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సునీల్ బాబుకు.. గురువారం రాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. సునీల్ బాబు మలయాళం, తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేశారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దగ్గర అసిస్టెంట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. తుపాకీ, భీష్మ పర్వం, మహర్షి, ఊపిరి, గజిని, ప్రేమమ్, చోటా ముంబై లాంటి ఎన్నో చిత్రాలకు పని చేసి, మంచి పేరును తెచ్చి పెట్టాయి. సింగ్ ఈజ్ కింగ్, MS ధోని, పా, లక్ష్య, స్పెషల్ 26 లాంటి మరెన్నో అతిపెద్ద బ్లాక్బస్టర్లకు కూడా పనిచేశాడు. దాంతో పాటు కాకుండా రోజ్ అనే ఆంగ్ల చిత్రానికి కూడా సునీల్ ఆర్ట్ డైరెక్షన్ చేశారు.
సునీల్ బాబు మృతికి చింతిస్తూ మలయాళ ప్రముఖ సినీ నిర్మాత అంజలి మీనన్ ఆయనకు నివాళులర్పించారు. ఇన్స్టాగ్రామ్లో సునీల్ ఫోటోను షేర్ చేస్తూ, "సునీల్ బాబు మరణవార్త విని చాలా షాక్ అయ్యాము.. బెంగుళూరు డేస్లో మేమిద్దరం కలిసి పనిచేశాము. ఆయనతో నాకు కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని నేను ఎప్పుడూ ప్రేమిస్తాను. శాంతితో విశ్రాంతి తీసుకోండి ప్రియమైన సునీల్" అంటూ ఎమోషనల్ కోట్ ను జత చేశారు.
ఇక సునీల్ మరణ వార్త విని నటుడు దుల్కర్ సల్మాన్ దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఈ సందర్భంగా సునీల్ చిత్రాన్ని పంచుకున్న ఆయన.. ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన గుండె పగిలిపోయిందని, తమ సినిమాలకు సునీల్ ప్రాణం పోశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సానుభూతి తెలుపుతూ దుల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక సీతా రామం చిత్రాన్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కూడా సునీల్ బాబుకు నివాళులర్పించింది. సునీల్ బాబు ఇక లేరు అని వినడానికి చాలా బాధపడుతున్నామని ఇన్సాస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.