న్యూఢిల్లీ : ఇండ్లకు డిమాండ్ పెరుగుతుండడంతో బిల్డర్లు, డెవలపర్లు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేస్తున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,989 ఎకరాలను 101 డీల్స్లో కొనుగోలు చేశారని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ పేర్కొంది. ఈ ఏడాది -మార్చి క్వార్టర్లో వీరు 29 ల్యాండ్ డీల్స్ను పూర్తి చేశారు. 721 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కిందటేడాది మార్చి క్వార్టర్లో జరిగిన ల్యాండ్స్ డీల్స్తో పోలిస్తే (ఎకరాల పరంగా) ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 61 % ఎక్కువ డీల్స్ జరిగాయి. అదే ఏడాది ప్రాతిపదికన 2023–24 లో 58 % పెరిగాయి. కిందటేడాది మార్చి క్వార్టర్లో 449 ఎకరాల కోసం 26 ల్యాండ్ డీల్స్ జరిగాయి. 2022–23 లో 88 ల్యాండ్ డీల్స్ జరగగా, 1,886 ఎకరాలను డెవలపర్లు కొన్నారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతుండడంతో..
2023–24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ల్యాండ్ డీల్స్లో 1,135 ఎకరాలకు చెందిన 83 డీల్స్ టాప్ ఏడు సిటీలలో జరిగాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి పేర్కొన్నారు. 1,853 ఎకరాలకు చెందిన 18 డీల్స్ అహ్మదాబాద్, అయోద్య, జైపూర్, నాగ్పూర్, మైసూర్, లుధియానా, సూరత్ వంటి టైర్ 2,3 సిటీలలో జరిగాయని వివరించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతుండడంతో టైర్ 2, 3 సిటీల్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఊపందుకుంటోందని అన్నారు. అనరాక్ డేటా ప్రకారం, ఢిల్లీ–ఎన్సీఆర్లో ఎక్కువ ల్యాండ్ డీల్స్ జరిగాయి.
ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 160 ఎకరాలకు సంబంధించి 12 డీల్స్ జరగగా, 2023–24 లో 313 ఎకరాలకు సంబంధించి 29 ల్యాండ్స్ డీల్స్ పూర్తయ్యాయి. అనరాక్ డేటా ప్రకారం, 2023–24 లో జరిగిన మొత్తం ల్యాండ్ డీల్స్లో 2,252 ఎకరాలకు చెందిన సుమారు 80 ల్యాండ్ డీల్స్ ఇండ్ల నిర్మాణం కోసం, ప్లాట్లను డెవలప్ చేయడం కోసం, టౌన్షిప్ ప్రాజెక్టులు కట్టడం కోసం జరిగాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో 42 ఎకరాలకు సంబంధించి నాలుగు డీల్స్ జరిగాయి.
ఈ రెండింటి కోసం నాలుగు సపరేట్ డీల్స్ జరగగా, 79 ఎకరాలను డెవలపర్లు కొనుగోలు చేశారు. ఇండస్ట్రియల్, ఐటీ, లాజిస్టిక్ పార్క్ల కోసం 164 ఎకరాలకు సంబంధించి ఐదు డీల్స్ పూర్తయ్యాయి. తయారీ ప్లాంట్లను నిర్మించేందుకు 411.75 ఎకరాలకు సంబంధించి మూడు ల్యాండ్ డీల్స్ జరిగాయి. డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లోధా, ప్రెస్టీజ్, బ్రిగేడ్ గ్రూప్, సిగ్నేచర్ గ్లోబల్ వంటి సంస్థలు ల్యాండ్ కొనుగోళ్లలో పాలుపంచుకున్నాయి.