శిథిలావస్థకు ఎంపీడీఓ ఆఫీసు.. హెల్మెట్లు ధరించి డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు

శిథిలావస్థకు ఎంపీడీఓ ఆఫీసు.. హెల్మెట్లు ధరించి డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు

జగిత్యాల జిల్లా బీర్‌పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని పని చేసుకుంటున్నారు. 

2016లో బీర్‌పూర్ మండలం ఏర్పడిన నాటి నుంచీ ఎంపీడీఓ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది నుంచి పెచ్చులూడుతోంది. గతేడాది ఎంపీడీఓ మల్లారెడ్డి కూర్చుని ఉండగా ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పటి అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించారు. కానీ.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.

ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతున్న కార్యాలయ ఉద్యోగులు ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం మరో చోటుకు మార్చాలంటూ సమీపంలోని అంజన్న ఆలయంలో కూడా వారు మొక్కుకున్నారు.