నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీలో మారిన రూల్స్.. పరిహారానికి ‘ఆధార్’ చిక్కులు !

నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీలో మారిన రూల్స్.. పరిహారానికి ‘ఆధార్’ చిక్కులు !
  • నిర్వాసితులు, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలకు ‘థంబ్’ లింక్ 
  • ప్రతీ సర్వే నెంబర్కు ఓటీపీ రావాల్సిందే.. 
  • టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో అప్ లోడ్ అయితలే..  ఓటీపీ రావట్లే.. 
  • ప్రస్తుతం 90 అకౌంట్లకు రూ.4.50 కోట్లు పరిహారం పెండింగ్ 
  • మాన్యువల్​ పద్ధతినే అమలు చేయాలని కోరుతున్న ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు: నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీలో నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​హెచ్ఏ​ఐ) తరచూ రూల్స్​ మారుస్తోంది. నిర్వాసితులకు ఆధార్​తో పాటు థంబ్​ తప్పనిసరి చేసింది. దీంతో పాటు ప్రతీ సర్వే నెంబర్​ డిటైల్స్​ అప్​లోడ్​కు అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోల ‘థంబ్’  తీసుకుంటోంది. కానీ టెక్నికల్​ ప్రాబ్లం వల్ల ఈ ప్రక్రియ ముందుకు సాగక పరిహారం పెండింగ్​లో ఉంటోంది.

భూ సేకరణ.. పరిహారం ఇలా..
ఎన్​హెచ్ఏ​ఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్​ ఆర్​) సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో దాదాపు 164 కిలోమీటర్లు నిర్మాణం కానుంది. సేకరిస్తున్న భూములకు 2022లో వేసిన ప్రైమరీ నోటిఫికేషన్​ (పీఎన్​) నాటికి పేర్కొన్న రిజిస్ట్రేషన్​ వాల్యూ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం ఎన్​హెచ్ఏ​ఐ అందించాల్సి ఉంటోంది.

పరిహార ప్రక్రియలో పలుమార్లు మార్పులు..
పరిహారం చెల్లింపుల విషయంలో ఎన్​హెచ్​ఏఐ ఇప్పటికే పలుమార్పులు చేసింది. మొదట్లో నిర్వాసితుడి నుంచి ప్రాజెక్టుల కోసం సేకరిస్తున్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్​బుక్స్, ఈసీతో పాటు పరిహారం జమ చేయడానికి బ్యాంక్​ పాస్​బుక్​ సేకరించేది. ఆ తర్వాత 2024లో పాన్​ కార్డును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటివరకూ పాన్​ కార్డులు లేని వాళ్లందరూ కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది.

అనంతరం నిర్వాసితుల వేలిముద్రలతో పాటు ఆధార్​తో అనుసంధానమైన మొబైల్​ ఫోన్​కు ఓటీపీ వచ్చేలా మార్పులు చేసింది. తాజాగా భూ సేకరణలో బాధ్యులైన అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోల ఆధార్​తో అనుంధానమైన మొబైల్ నెంబర్​ను ఉపయోగించాలని సూచిస్తూ వారి థంబ్​ను తప్పని సరి చేసింది. వీటికి సంబంధించిన సాఫ్ట్​వేర్​ భూ సేకరణ విభాగాల్లోని కంప్యూటర్లలో ఇప్పటికే ఇన్​స్టాల్​ చేశారు. థంబ్​ నమోదు కోసం బయోమెట్రిక్​ డివైస్​ పంపిణీ చేశారు.

ప్రతీ సర్వే నెంబర్కు ‘ఓటీపీ’
ఆధార్, థంబ్​ తప్పనిసరి చేయడంతో నిర్వాసితులందరూ భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆఫీసులకు తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో భూ సేకరణ బాధ్యులైన అడిషనల్​ కలెక్టర్లు, ఆర్డీవోలు కూడా తమ ఆఫీసుల్లోనే ఉండాల్సి వస్తోంది. ప్రాజెక్టులకు భూమి ఇస్తున్న రైతు, ఖాళీ స్థలం యజమాని తన బ్యాంక్​ అకౌంట్ నంబర్​ను ‘ప్రాజెక్ట్​ ఫైనాన్సియల్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్’లో అప్​లోడ్​ చేయడానికి థంబ్​ నమోదు చేయాల్సి ఉంటుంది.

అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోలు కూడా తమ థంబ్​ నమోదు చేయాలి. ఆ తర్వాతే రైతులతోపాటు ఆఫీసర్లకు సంబంధించిన ఆధార్​తో అనుసంధామైన మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఆయా ఓటీపీలను ఎంటర్​ చేస్తేనే నిర్వాసితుడి అకౌంట్​ ఓకే అవుతుంది. అయితే టెక్నికల్​ ప్రాబ్లం వల్ల  ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో ఆఫీసర్లు గతంలోఉన్న పద్ధతిని అమలు చేయాలని కోరుతున్నారు. దీనికి ఎన్​హెచ్​ఏఐ ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది.

పెండింగ్​లో రూ. 4.50 కోట్లు..
యాదాద్రి జిల్లా మీదుగా నిర్మాణమయ్యే ట్రిపుల్​ ఆర్​ కోసం తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్​ ‘కాలా’ల పరిధిలో 1,795 ఎకరాలను సేకరిస్తున్నారు. భువనగిరి కాలా పరిధిలో ఇంకా సర్వే జరగలేదు. దీంతో సర్వే ముగిసిన తుర్కపల్లి, పురోగతిలో ఉన్న చౌటుప్పల్​ పరిధిలో 1050 సర్వే నెంబర్లకు రూ. 147 కోట్లు పరిహారం అందింది. తాజాగా తుర్కపల్లి పరిధిలోని దాతరుపల్లి, వీరారెడ్డి పల్లి పరిధిలోని 90 సర్వే నెంబర్లకు సంబంధించిన లిస్ట్​ ఎన్​హెచ్​ఐ వద్ద రెడీగా ఉంది.

ఆధార్, థంబ్ సేకరణ కోసం రూపొందించిన సాఫ్ట్​వేర్​ సపోర్ట్​ చేయకపోవడంతో ఈ 90 సర్వే నెంబర్లకు సంబంధించి రూ. 4.50 కోట్లు పెండింగ్​లో ఉండిపోయాయి. తుర్కపల్లి, చౌటుప్పల్​ కాలా పరిధిలో మరో 1600 సర్వే నెంబర్లకు సంబంధించి ఆధార్, థంబ్​ నమోద్​ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే రూ. 280 కోట్లు నిర్వాసితులకు అందుతాయి.