లాక్‌‌డౌన్ వద్దు.. సాయంత్రం 6 తర్వాత కర్ఫ్యూ

లాక్‌‌డౌన్ వద్దు.. సాయంత్రం 6 తర్వాత కర్ఫ్యూ

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌‌డౌన్‌‌ను పొడిగించొద్దని సీఎం కేసీఆర్‌‌ను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కోరారు. లాక్‌డౌన్ పెట్టిన ఈనెల 12వ తేదీ కంటే ముందు నుంచే రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుతున్నట్లు వివరాలు స్పష్టం చేస్తున్నాయని ఓవైసీ అన్నారు. లాక్‌డౌన్ లేకపోయినా కరోనాను ఎదుర్కోవచ్చని, కాబట్టి లాక్‌డౌన్‌ను పొడిగించొద్దని విజ్ఞప్తి చేశారు.

‘లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోంది. లాక్ డౌన్‌‌పై నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నా. కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి. లాక్ డౌన్ కంటే ముందే కోవిడ్ కేసులు తగ్గుతున్నట్లు ఇప్పటికే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. లాక్ డౌన్ వల్లే కేసులు తగ్గలేదు. లాక్ డౌన్ లేకపోయినప్పటికీ కోవిడ్ ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. మహమ్మారిపై సుధీర్ఘ పోరాటం చేయాలన్న వాస్తవాన్ని అందరమూ అంగీకరించాలి’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.

‘మాస్కుల వినియోగం, భౌతికదూరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే కరోనాపై పోరాడొచ్చు. అందుకు అనుగుణమైన జీవనవిధానం ఉండేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలి. మహమ్మారికి ధీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమే. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. మహమ్మారి, పేదరికం, పోలీసుల వేధింపులతో చాలా ఇక్కట్లలో పడతారు. ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతి, భద్రతల సమస్యగా మారుస్తున్నాయి. ఇది ఎంతమాత్రం శాస్త్రీయ, మానవతా ధృక్పథం కాదు. లాక్ డౌన్ పొడిగించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాను. జనసమ్మర్దాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించాలి లేదా కోవిడ్ క్లస్టర్లలో మినీ లాక్ డౌన్ విధించాలి. కానీ కేవలం 4 గంటల సడలింపులతోనే 3.5 కోట్ల మంది జీవనం వారాలపాటు కొనసాగించాలని భావించడం తగదు’ అని ఓవైసీ పేర్కొన్నారు.