
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగ్యూ సోకి కన్నుమూశారు. మెహన్సా జిల్లా ఉంఝా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇవాళ అహ్మదాబాద్లో తుది శ్వాస విడిచారు. వారం రోజుల క్రితం ఢిల్లీలో ఓ ఆస్పత్రిని సందర్శించిన సమయంలో డెంగ్యూ సోకింది. తన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురై ఉంఝాలోని సువిధ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అహ్మదాబాద్లోని జైడస్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉంచి బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మెహన్సా జిల్లాలోని విశోల్ గ్రామానికి చెందిన అవివాహితురాలు ఆశాబెన్. తల్లి హీరాబెన్, ముగ్గురు అక్కలు, తమ్ముడితో కలిసి ఉంటున్న ఎమ్మెల్యే ఆశాబెన్ మరణవార్త తెలిసి బీజేపీ ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.