
- హ్యాండ్షేక్ వివాదం తర్వాత సర్వత్రా ఉత్కంఠ
- రా. 8 నుంచి సోనీ స్పోర్ట్స్లో లైవ్
దుబాయ్: క్రికెట్ ప్రపంచానికే కిక్కిచ్చే ఇండో–పాక్ పోరు వారం వ్యవధిలోనే రెండోసారి అభిమానులను అలరించనుంది. ఆసియా కప్ సూపర్–-4 రౌండ్లో చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం హై- వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గత వారం జరిగిన మ్యాచ్లో మొదలైన షేక్ హ్యాండ్ వివాదం, మ్యాచ్ రిఫరీ నియామకంపై చెలరేగిన దుమారం ఈ పోరును మరింత రసవత్తరంగా మార్చాయి. ఇండియా ప్రత్యర్థితో చేయి కలపడానికి ఇష్టపడటం లేదు. పాక్కు మ్యాచ్ రిఫరీ నచ్చడం లేదు. అయితే, గ్రూప్ దశలో పాక్ను చిత్తుగా ఓడించిన టీమిండియా మరోసారి అదే రిజల్ట్ను రిపీట్ చేయాలని డిసైడైంది. ఇంకోవైపు గత పోరులో ఓటమితో పాటు.. తమకు షేక్హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన సూర్యకుమార్ సేనపై రివెంజ్ తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. దాంతో ఇరు జట్ల గత మ్యాచ్తో పోలిస్తే ఈ పోరులో హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది.
స్పిన్నర్లపై ఇండియా ఆశలు
గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా సూపర్–4 రౌండ్లోనూ అదే జోరు కొనసాగిస్తూ పాకిస్తాన్పై మరోసారి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. దుబాయ్ స్టేడియం పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలోజట్టు తన స్పిన్ త్రయంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే 8 వికెట్లతో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్తో పాటు, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి.. పాక్ బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేయడంలో కీలకం కానున్నారు. గత మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రానుండటంతో ఇండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. అయితే, ఒమన్తో మ్యాచ్లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో తలకు గాయమైన ఆల్-రౌండర్ అక్షర్ పటేల్ ఫిట్నెస్పై కొంత ఆందోళన నెలకొంది. అక్షర్ అందుబాటులో లేకపోతే, తన స్థానంలో వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇండియా బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ ఫామ్లోకి రాకపోవడం, హార్దిక్ పాండ్యా, శివం దూబేకు క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాకపోవడం వంటి చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, టాప్-–4 బ్యాటర్లు పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని టీమ్ మేనేజ్మెంట్ ధీమాతో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఛేజింగ్లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సూర్యకుమార్, గత పోరులో ఫిఫ్టీతో మెరిసిన శాంసన్ ఈ మ్యాచ్లో కూడా కీలకం కానున్నారు.
పాక్కు బ్యాటింగ్ టెన్షన్
గతంలో జావెద్ మియాందాద్, ఇంజమామ్- -హక్ వంటి మేటి బ్యాటర్లను అందించిన పాకిస్తాన్ ప్రస్తుత జట్టులో నాణ్యమైన బ్యాటర్లు లేక ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా స్పిన్ను ఎదుర్కోవడంలో ఆ టీమ్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఓపెనర్ సైమ్ అయూబ్ రన్స్ కంటే వికెట్లే ఎక్కువగా తీస్తున్నాడంటూ సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారాడు. ప్రస్తుత జట్టులో ఫఖర్ జమాన్, షాహీన్ అఫ్రిది మాత్రమే మెరుగ్గా ఆడుతున్నారు. సాహిబ్జదా ఫర్హాన్, హసన్ నవాజ్ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, బౌలింగ్లోనూ పాక్ ఆశించిన మేర రాణించడం లేదు. షాహీన్ ఆఫ్రిదిపై అతిగా ఆధారపడి బోల్తా కొడుతోంది. గత వారం ఇండియాపై పాక్ ముగ్గురు స్పిన్నర్లతో దిగినా.. ఈ మ్యాచ్ కోసం మూడో స్పిన్నర్ సూఫియన్ బదులు రవూఫ్ను బరిలోకి దించే చాన్సుంది. ఇక కీలక సమయాల్లో ఒత్తిడికి చిత్తవడం పాక్ను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాతో పోరుకు ముందు పాక్ ఆటగాళ్ల కోసం మోటివేషన్ స్పీకర్ రహీల్ కరీం సేవలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. రహీల్ పాక్ ఆటగాళ్లలో ఏమేరకు స్ఫూర్తిని నింపాడో చూడాలి.
రిఫరీగా పైక్రాఫ్ట్.. ప్రెస్ కాన్ఫరెన్స్కు పాక్ దూరం
పాక్ ప్లేయర్తో నో హ్యాండ్షేక్ విధానాన్ని ఇండియా ఈ మ్యాచ్లోనూ కొనసాగించనుంది. ఈ మ్యాచ్కు కూడా ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా అపాయింట్ అయ్యాడు. పైక్రాఫ్ట్ను తమ మ్యాచ్ల నుంచి తొలగించాలని పీసీబీ రెండుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఐసీసీ పట్టించుకోలేదు. గత ఇండో–పాక్ పోరులో రచ్చరేపిన ‘హ్యాండ్షేక్’ విషయంలో పైక్రాఫ్ట్ కేవలం సమాచారాన్ని చేరవేశాడని, అతని తప్పు లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం తమ ప్రెస్ కాన్ఫరెన్స్ను పాక్ జట్టు రద్దు చేసుకుంది. పైక్రాఫ్ట్ నియామకం, షేక్ హ్యాండ్ వివాదంపై వచ్చే ప్రశ్నలను తప్పించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, శాంసన్ (వికెట్ కీపర్), దూబే, పాండ్యా, అక్షర్/సుందర్/అర్ష్దీప్, కుల్దీప్, బుమ్రా, చక్రవర్తి.
పాకిస్తాన్: ఫర్హాన్, సైమ్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆగా (కెప్టెన్), హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, షాహీన్ షా, రవూఫ్, అబ్రార్.