
- ఫైనల్లో ఇరాన్ను చిత్తు చేసిన మెన్స్ టీమ్
- ఎనిమిదో సారి గోల్డ్ మెడల్ సొంతం
బుసాన్ ( సౌత్ కొరియా):ఇండియా మెన్స్ కబడ్డీ టీమ్ మరోసారి తొడగొట్టింది. కబడ్డీ కూతలో తమకు ఎదురు లేదని మరోసారి చాటి చెప్పింది. ఆసియా కబడ్డీ చాంపియన్షిప్లో ఎనిమిదో సారి విజేతగా నిలిచి సత్తా చాటుకుంది. కొరియాలోని బుసాన్లో జరిగిన ఈ టోర్నీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తమ జైత్రయాత్రను కొనసాగించింది. టోర్నీలో పరాజయమే లేకుండా గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంప్ ఇండియా 42–-32తో ఇరాన్ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ సూపర్- 10తో సత్తా చాటాడు. దాంతో, ఈ టోర్నీలో గత తొమ్మిది ఎడిషన్లలో ఇండియా ఎనిమిదోసారి గోల్డ్ నెగ్గడం విశేషం. అంతకుముందు జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఇండియా 64-–-20తో హాంకాంగ్ను ఓడించింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి టాప్ ప్లేస్తో ఫైనల్కు వచ్చింది. ఆరు జట్లు పోటీ పడ్డ టోర్నీలో ఇరాన్ రెండో ప్లేస్తో తుదిపోరుకు వచ్చింది. లీగ్ దశలో ఇండియా చేతిలో ఓడిన ఆ జట్టు ఫైనల్లోనూ చిత్తయి రన్నరప్తో సరిపెట్టింది.
పవన్, ఇనాందార్ జోరు
వెటరన్ ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగిన ఇరాన్ఫై ఇండియా ఈజీగా గెలిచింది. మ్యాచ్లో తొలి పాయింట్ ఇరానే సాధించినా.. ఇండియా రైడర్లు ఆట ఆసాంతం జోరు చూపెట్టారు. వాళ్ల దూకుడుతో మ్యాచ్ మొత్తం ఆరు, ఏడు పాయింట్లతో మన టీమ్ ముందుకెళ్లింది. సయెద్ ఘఫారి, మోయిన్ షఫాగి, అమిర్ మొహమ్మద్, మొహమ్మద్ రెజా తదితరులు డిఫెన్స్లో సత్తా చాటినా.. ఇరాన్ రైడర్లు ఇండియన్స్ ముందు తేలిపోయారు.మరోవైపు పవన్ కు తోడు అస్లాం ఇనాందార్, అర్జున్ దేశ్వాల్, డిఫెండర్ సుర్జీత్ కూడా రాణించడంతో ఫస్టాఫ్లోనే ఇరాన్ను రెండు సార్లు ఆలౌట్ చేసిన ఇండియా 23–11తో సెకండాఫ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మరింత జోరు పెంచింది. బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే మరోసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో 33–14తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఈ దశలో ఇరాన్ ఆల్ రౌండర్ ఆల్-రౌండర్ మొహమ్మద్ రెజా తమ జట్టును రేసులోకి తేవడానికి ప్రయత్నించాడు. అతను బోనస్ పాయింట్లకు తోడు మూడు పాయింట్ల రైడ్ చేయడంతో ఇండియాను ఆలౌట్ చేసిన ఇరాన్ 35–26తో ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ, మిగతా ఆటగాళ్ల నుంచి రెజాకఉ సపోర్ట్ కరువైంది. అదే సమయంలో మరిన్ని పాయింట్లు రాబట్టిన ఇండియా సులువుగా గెలిచి ట్రోఫీ సొంతం చేసుకుంది.