- కలెక్టర్ కె.హరిత
కాగజ్ నగర్, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక పాత్ర అని ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని సూచించారు. కాగజ్నగర్లోని మైనారిటీ స్కూల్లో ఆసిఫాబాద్ డివిజన్లోని ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల సర్పంచ్ లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి గురువారం కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో శానిటేషన్, వీధి దీపాల ఏర్పాటు, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేపట్టిన క్లాస్రూమ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, డివిజనల్ పంచాయతీ అధికారులు ఉమర్ హుస్సేన్, హరిప్రసాద్, ఎంపీవోలు శ్రీనివాస్, సాయిరాం గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం తదితరులున్నారు.
