V6 News

అట్టహాసంగా ప్రారంభమైన..అస్మిత ఖేలో ఇండియా పోటీలు

అట్టహాసంగా ప్రారంభమైన..అస్మిత ఖేలో ఇండియా పోటీలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​ సింగరేణి ఠాగూర్  స్టేడియంలో సోమవారం అస్మిత ఖేలో ఇండియా అండర్–16 గర్ల్స్​ ఫుట్​బాల్​ ఛాంపియన్–2026 పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఫుట్​బాల్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీలను మందమర్రి సీఐ పర్స రమేశ్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం(ఏఐటీయూసీ) స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర ఫుట్​బాల్  అసోసియేషన్  జనరల్ సెక్రటరీ ఫాల్గుణ ప్రారంభించారు.

క్రీడల్లో గెలుపోటములు పట్టించుకోకుండా క్రీడాస్ఫూర్తిని చాటాలని వారు సూచించారు. ప్రతిరోజు 8 మ్యాచ్​ల చొప్పున మూడు రోజుల పాటు టోర్నీ జరుగుతుందని, ఈ నెల 29న విజేతలకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్  చైర్​పర్సన్​ డాక్టర్​ గొడిసెల సంధ్యారాణి, వైస్  చైర్​పర్సన్  మిట్టపల్లి సరిత, టౌన్  ఎస్సై శ్రీధర్, నిర్వాహకులు పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్  పాల్గొన్నారు. -తొలి రోజు పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా జట్లు రెండు మ్యాచ్​ల్లోనూ విజయం సాధించింది.