- ఓవైపు ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్ల చెకింగ్
- ముగిసిన ఇంటింటి సర్వే
- జోరుగా కొత్త ఓటర్ల ఎన్రోల్మెంట్
- ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ విడుదలకు సన్నాహాలు
- బీఎల్వోలుగా అంగన్వాడీలు, ఆశాల నియామకం
- 10 నుంచి అవగాహన కార్యక్రమాలు
- రాష్ట్రంలోనూ హోం ఓటింగ్కు చర్యలు
మహబూబ్నగర్, వెలుగు: రాష్ర్టంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్యలో ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన వచ్చే డిసెంబర్లో ఎలక్షన్లు ఉంటాయని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లను స్పీడప్ చేసింది. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు లిస్టులో మార్పులు,చేర్పులు, ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్ల తనిఖీలను ముమ్మరం చేశారు. బీఎల్వోల నియామకంతో పాటు శాఖలవారీగా ఆఫీసర్లు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ దాదాపు పూర్తికావచ్చింది. అటు బూత్లవారీగా సౌలతుల ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలైంది. మరోవైపు కొత్త ఓటర్ల ఎన్రోల్మెంట్జోరుగా సాగుతోంది. ఈక్రమంలోనే ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ నెల చివరికల్లా ఏర్పాట్లు పూర్తిచేసి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు యావత్ యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది.
ముగిసిన హౌస్ టు హౌస్ సర్వే
ఓటర్ లిస్టులో మార్పు చేర్పుల కోసం చేపట్టిన హౌస్ టూ హౌస్ సర్వే జూన్ 23కే పూర్తయింది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా నియమించిన అంగన్వాడీలు, ఆశాలు పాత ఓటర్ లిస్టుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ‘ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నారు? ఓటరు లిస్టులో ఉన్న వ్యక్తులు బతికే ఉన్నారా? ఇకడే నివాసం ఉంటున్నారా? చనిపోయారా? వీరి పేర్లను లిస్టులో నుంచి తీసేయాల్సిన అవసరం ఉందా? పేర్లు, అడ్రస్లో మార్పులు చేయాల్సి ఉందా? ఆ ఇంట్లో 18 ఏండ్లు నిండిన యువత ఉన్నారా? వారికి ఓటు హక్కు కల్పించాలా?’ అనే వివరాలను నోట్ చేశారు. ఈ వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిన యువతుల వివరాలను ఆయా ఊళ్లకు షిఫ్ట్ చేస్తున్నారు. ఒకే పేరు మీద ఎంట్రీ అయిన డబుల్ ఓట్లను సరిచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ 70 శాతం పూర్తి కాగా, ఈ నెలాఖరు నాటికి వంద శాతం కంప్లీట్ చేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ సర్వే ద్వారా 10.5 లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించినట్లు తెలిసింది.
పోలింగ్ స్టేషన్ల తనిఖీలు..
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర జిల్లా స్థాయి ఆఫీసర్లు వారంలో రెండు రోజులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. వీరితో పాటు బీఎల్వోలతో స్టేషన్ల విజిట్ చేయిస్తున్నారు. అక్కడ ఎలాంటి వసతులు అవసరం ఉన్నాయి? కరెంటు ఉందా? లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయా? మంచినీళ్లు అందుబాటులో ఉన్నాయా? టాయిలెట్స్ ఉన్నాయా? ఫర్నిచర్ ఉందా? ర్యాంప్ ఉందా? అనే వివరాలను ఫీల్డ్కు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇంకా ఎలాంటి వసతులు కల్పించాలనేది నోట్ చేసుకుంటున్నారు. క్రిటికల్, హైపర్ క్రిటికల్, సెన్సిటివ్ ఏరియాలను మండల స్థాయి ఆఫీసర్లు విజిట్ చేస్తున్నారు. సెన్సిటివ్ ఏరియాల్లో పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్చాలా? రష్ ఎక్కువగా ఉంటే స్టేషన్ ప్రాంతంలో అదనంగా మరో స్టేషన్ అవసరం అవుతుందా? అనే వివరాలను ఫీల్డ్ విజిట్లో రికార్డ్ చేస్తున్నారు.
డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్కు రెడీ..
కొత్త ఓటరుగా ఎన్రోల్ చేసుకోవడానికి పబ్లిక్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రామాల్లో కొందరు వలంటీర్లు, బీఎల్వోలు సైతం 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించి, వారితో కొత్త ఓటరుగా నమోదు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ జోరుగా సాగుతుండగానే మరోవైపు కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన అప్లికేషన్లు, మార్పులు, చేర్పులు, డిలిషన్ వివరాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ను పబ్లిష్ చేయనుంది. ఈ లిస్టును అన్ని గ్రామాలవారీగా పంచాయతీ ఆఫీసుల వద్ద అతికించనున్నారు. వీటి ఆధారంగా మళ్లీ అబ్జెక్షన్లు, మిస్సింగ్ నేమ్స్ తదితర వివరాలను సేకరించనున్నారు. పొలిటికల్ పార్టీలకు ఈ లిస్ట్ను అందజేసి, శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించనన్నారు. అనంతనం సెప్టెంబరులో తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
గ్రామాలకు మొబైల్ ఈవీఎంలు
ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలక్షన్ కమిషన్ డెమాన్స్ర్టేషన్, స్టాస్టిక్ ఈవీఎంలను అందుబాటులోకి తేనుంది. ఇందులో ఒక సెట్ తహసీల్దార్ ఆఫీసులో, మరొక సెట్ మొబైల్ ఈవీఎం ద్వారా గ్రామాల్లో ప్రదర్శించనున్నారు. మొబైల్ టీం వెంట సెక్టోరియల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 10 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 30 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఆఫీసర్లు రూట్ మ్యాప్లకు సంబంధించిన షెడ్యూల్స్ తయారు చేస్తున్నారు.
ఈవీఎంల భద్రతపై స్పెషల్ ఫోకస్
ఈవీఎంలను భద్రపర్చిన స్ర్టాంగ్ రూమ్లను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ స్థాయి ఆఫీసర్లు నిత్యం తనిఖీ చేస్తున్నారు. ఈవీఎంల భద్రత ఎలా ఉంది? అనే దానిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. అలాగే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎన్ని ఈవీఎంలు అవసరం అవుతాయనే వివరాలను నోట్ చేస్తున్నారు.
బీఎల్వోల కీ రోల్..
ఎన్నికల ఏర్పాట్లలో బీఎల్వోలు కీ రోల్ పోషిస్తున్నారు. విలేజ్ లెవల్లో 12 కేటగిరీలలో ఉన్న వర్కర్లను బీఎల్వోలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోగా, అందులో తెలంగాణలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, పంచాయతీ సెక్రటరీలు, వీవోఏలను బీఎల్వోలుగా నియమించారు. రాష్ర్ట వ్యాప్తంగా 34,867 మంది ప్రస్తుతం బీఎల్వోలుగా పని చేస్తుండగా, వీరిలో అత్యధిక మంది అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలే ఉన్నారు. వీరికి మొబైల్ టెక్నాలజీపై పట్టు ఉండటం, గ్రామ స్థాయిలో అందరితో పరిచయాలు ఉండటం, గతంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో భాగస్వామ్యం కావడంతో ఎక్కువ జిల్లాల్లో అంగన్వాడీలు, ఆశలనే బీఎల్వోలుగా నియమించారు.
బీఎల్వో యాప్
ఎన్నికలకు సంబంధించిన వివరాలు గతంలో గరుడ యాప్ ద్వారా అప్డేట్ చేసేవారు. కానీ, ఇప్పుడు బీఎల్వో యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారానే కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, డెలిషన్కు సంబంధించిన ఫామ్స్ను బీఎల్వోలో అప్లోడ్ చేస్తున్నారు. తర్వాత ఈ వివరాలు ఎన్నికల సూపర్వైజర్లకు చేరుతాయి. వారు వెరిఫై చేసి ఏఈఆర్వో (తహసీల్దార్) లాగిన్ను సెండ్ చేస్తారు. ఏఈఆర్వో చెక్ చేశాక ఈఆర్వో (ఆర్డీవో) లాగిన్కు సెండ్ అవుతాయి. ఈఆర్వో ఫైనల్ అప్రూవల్ తర్వాత కొత్త కార్డు జారీ, ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
జోరుగా మార్పులు చేర్పులు
డబుల్ ఓటర్ల అబ్జెక్షన్, డిలిషన్, చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు గతంలో ఐదారు రకాల పత్రాలు సబ్మిట్ చేయాల్సి వచ్చేది. కానీ,ఈసారి వీటన్నింటినీ పక్కనపెట్టిన ఈసీ, ఫామ్-6, 7, 8లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫామ్ -6 ద్వారా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. ఫామ్- 6బీని ఓటరు జాబితాకు ఆధార్ కార్డు లింక్ చేయడానికి వాడుతున్నారు. ఫామ్-7 ద్వారా చనిపోయిన వారి పేర్లు తొలగించడం, పెళ్లిళ్లు చేసుకొని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారి పేర్లను మార్చడం, డబుల్ ఓట్ల అబ్జక్షన్, డిలిషన్కు సంబంధించిన ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. ఫామ్-8లో మూడు రకాలున్నాయి. మొదటిది మైగ్రేషన్ ఓటర్లు (వలస ఓటర్లు). ఒక నియెజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటరును మార్చుకోవానికి ఈ ఫామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెండోది ఓటరు కార్డు కరెక్షన్. కార్డులో పేరు, తండ్రి పేరు, జండర్, వయసు, ఇంటి అడ్రెస్ కరెక్షన్లు చేసుకోవచ్చు. మూడోది పర్సన్ విత్ డిజేబులిటీ (పీవీడీ). ఈ ఫామ్ ద్వారా దివ్యాంగులు ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు. వచ్చిన అప్లికేషన్ను బీఎల్వోలు వెరిఫై చేసి, అప్రూవల్కు పంపిస్తారు. అప్రూవల్ తర్వాత ఓటరు జాబితాలో వీరి పేరు వద్ద టిక్ మార్కింగ్ వేస్తారు. ఆ మార్క్ ఆధారంగా అక్కడి పోలింగ్ స్టేషన్లో సౌలత్లు కల్పిస్తారు.
కర్ణాటక తరహాలోనే హోం ఓటింగ్
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఈసా హోం ఓటింగ్ను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఆఫీసర్ల మీటింగుల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ, క్లారిటీ ఇవ్వలేదు. అయితే హోం ఓటింగ్ కేవలం 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు వర్తింపజేస్తారు. హోం ఓటింగ్ కోసం ముందుగానే బీఎల్వోలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వారు అప్రూవల్ చేశాక, బ్యాలెట్ ఒటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
