అజాత శ‌త్రువు రోశయ్య

అజాత శ‌త్రువు రోశయ్య

కొణిజేటి రోశయ్య వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటు ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైన అపారమైన పట్టు, అవగాహన ఆయన సొంతం. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. రాజనీతిలో అపర చాణక్యుడు రోశయ్య. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. ఆయనో మాటల మాంత్రికుడు. మాటలతో చెడుగుడు ఆడుకునే తీరు ఆయన సొంతం. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు. మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు.

బడ్జెట్ ​కూర్పులో ఘనాపాఠి

రోశయ్య1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ అభ్యసించారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున1968,1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు,
1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ,1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు,1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు,1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు.

2004, 2009లో వైఎస్సార్​ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాఠిగా పేరుపొందారు. రాజ‌కీయాల్లో అజాత శ‌త్రువుగా పేరు పొందారు. 1995-–97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు.1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004–-09 కాలంలో12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనా, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో ఆంధ్ర యూనివర్సిటీ రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.  రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు అక్కడ సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగెటివ్ పాలిటిక్స్ చేయొచ్చు. అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్ పాలిటిక్స్ నడపచ్చు అనేవారు, అదే ఆయన కత్తికి రెండు వైపులా పదును. 

సీఎంగా, గవర్నర్​గా సేవలందించి..

వైఎస్సార్ ​హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో 2009 సెప్టెంబర్ 3న రోశయ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన తర్వాత 2010 నవంబరు 24న తన పదవికి రాజీనామా చేశారు. 2018 ఫిబ్రవరి11న టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, రోశయ్యకు స్వర్ణ కంకణం బహూకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని ఈ సందర్భంగా రోశయ్య తెలిపారు.

ఆ సమయంలోనే వెంకయ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య, రోశయ్యలకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో 2021 డిసెంబర్​4న హైదరాబాదులో కన్నుమూశారు. ప్రజాజీవితంలో ఆయన ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఓ రుషి మాదిరి సమాజ సేవలందించారు. ఆయన రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉన్నారే తప్ప, వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎలాంటి గొడవలు, వైరం పెట్టుకోలేదు. ఆయన డిసెంబర్​4న మృతి చెందినప్పటికీ తెలుగు తిథి ప్రకారం నేడు నవంబర్​22న ప్రథమ వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇదే అక్షర నివాళి. - తిరుమలగిరి సురేందర్,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్