మాస్ లీడర్ నైన.. నాకు స్పీకర్ పదవి కొత్తగా ఉంది : గడ్డం ప్రసాద్ కుమార్

మాస్ లీడర్ నైన.. నాకు స్పీకర్ పదవి కొత్తగా ఉంది : గడ్డం ప్రసాద్ కుమార్
  •     అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

బషీర్ బాగ్,  వెలుగు :  మాస్ లీడర్ ను అయిన తనకు  స్పీకర్ పదవీ ఇచ్చి కాళ్లు, చేతులు కట్టేశారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. గ్రామాల్లో తిరుగుతూ అందరిని కలిసి స్నేహ పూర్వకంగా మాట్లాడే తనకు పదవి కొంత కొత్తగా ఉందని తెలిపారు. అయినా తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన రాజ్యాంగ పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో గోల్కొండ సాహితీ కళాసమితి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలుగు భాష చైతన్య సమితి

లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన విధులను సక్రమంగా నిర్వహించి మంచి  పేరు తెచ్చుకుంటానన్నారు. గత పాలకులు  కవులను దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని, తను మాత్రం ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అన్నివిధాలా అండగా ఉంటానని స్పీకర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సాహిత్య, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు అర్థ చంద్రశేఖర్ రెడ్డి , ప్రొఫెసర్ ఎం భాగయ్య , రాఘవేంద్రాచార్యులు , బడే సాహెబ్ , ప్రజ్ఞరాజు తదితరులు పాల్గొన్నారు.