గ్లోబల్గా నియమించు కుంటామన్న కంపెనీ
క్యూ1 లో రూ. 5,195 కోట్లుగా కంపెనీ ప్రాఫిట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్లాన్స్ వేస్తోంది. ఇండియాతో పాటు, ఇతర దేశాల్లో కలిపి ఈ నియామకాలను చేపట్టనుంది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి మొత్తం 2.67 లక్షల మంది ఉద్యోగులు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్ నాటికి ఈ నెంబర్ 2.59 లక్షలుగా ఉందని అన్నారు. గత కొంత కాలం నుంచి ఐటీ సెక్టార్కు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యిందని, ఈ డిమాండ్ను చేరుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్గా 35 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని ప్రవీణ్ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్లో వాలంటరీ అట్రిషన్ (జాబ్ మానేయడం) జూన్ క్వార్టర్లో 13.9 శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 10 శాతంగా నమోదయ్యింది. కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే (15.6 శాతం) మాత్రం తగ్గింది. ఉద్యోగుల కోసం అనేక ప్రోగ్రామ్లను తీసుకొస్తున్నామని ప్రవీణ్ చెప్పారు.
ఇన్ఫోసిస్ లాభం పైకి..
ఇన్ఫోసిస్కు జూన్తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 5,195 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్ 22.7 శాతం పెరిగింది. రెవెన్యూ కూడా17.9 శాతం ఎగిసి రూ. 27,896 కోట్లకు చేరుకుంది. కంపెనీకి పెద్ద డీల్స్ రావడం కొనసాగుతోంది. జూన్ క్వార్టర్లో టీసీవీ నుంచి 2.6 బిలియన్ డాలర్ల విలువైన డీల్ను కంపెనీ పొందగలిగింది. ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ మార్జిన్ 23.7 శాతం పెరిగింది. నిలకడైన కరెన్సీ వద్ద, జూన్ క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 16.9 శాతం, క్వార్టర్లీ పరంగా 4.8 శాతం పెరిగింది. కంపెనీ మొత్తం రెవెన్యూలో డిజిటల్ ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ 53.9 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మార్జిన్స్ 22–24 శాతం పెరుగుతాయని ఇన్ఫోసిస్ అంచనావేస్తోంది. ‘ఉద్యోగుల నిబద్ధత, క్లయింట్ల నమ్మకంతో గత పదేళ్లలోనే ఎక్కువ గ్రోత్ను ఈ క్యూ 1 లో నమోదు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ 14–16 శాతం పెరుగుతుందనే నమ్మకాన్ని ఈ నెంబర్లు ఇచ్చాయి’ అని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు.