
లండన్: వరల్డ్ ర్యాపిడ్ , బ్లిట్జ్ చెస్ టీమ్ చాంపియన్షిప్లో ఇండియా ప్లేయర్ అథర్వ తయాడే సత్తా చాటుతున్నాడు. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న టీమ్ ఎంజీడీ–1 రెండో రోజు, శుక్రవారం (June 13) ఆట ముగిసేసరికి 13 మ్యాచ్ పాయింట్లతో హెక్సామైండ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇరు జట్లూ మొత్తంగా ఆరు విజయాలు, ఒక డ్రా, ఒక ఓటమి ఖాతాలో వేసుకున్నాయి.
ఎంజీడీ-–1కు తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ నాయత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది గేమ్స్లోనూ గెలిచి అథర్వ రికార్డు సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ నేతృత్వంలోని ఫ్రీడమ్తో పాటు ఉజ్బెకిస్తాన్, జర్మనీ అండ్ ఫ్రెండ్స్ జట్లు తలో 12 పాయింట్లతో నిలిచాయి.
అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకామురా, అలీరెజా ఫిరౌజా, వెస్లీ సో వంటి టాప్ ప్లేయర్లతో టాప్ సీడ్ డబ్ల్యూఆర్ టీమ్ వరుస ఓటములతో ఆరో ప్లేస్కు పడిపోయింది. ఐదో రౌండ్లో ఫ్రీడమ్ టీమ్తో డ్రా చేసుకున్న ఎంజీడీ–1 ఆరో రౌండ్లో డబ్ల్యూఆర్ చెస్ను 4–-2 తో ఓడించి సంచలనం సృష్టించింది. ఏడో రౌండ్లో 3.5-–2.5తో జర్మనీ అండ్ ఫ్రెండ్స్పై విజయం సాధించింది. కానీ ఎనిమిదో రౌండ్లో 2–4తో హెక్సామైండ్ చేతిలో ఓడింది.