మళ్లీ ఓడిన అమ్మాయిలు.. రెండో వన్డేలో ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపు

మళ్లీ ఓడిన అమ్మాయిలు.. రెండో వన్డేలో ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపు

హోబర్ట్‌‌: బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో మెరిసినా.. కీలకమైన క్యాచ్‌‌లు వదిలేయడంతో ఆస్ట్రేలియా విమెన్స్‌‌తో జరిగిన రెండో వన్డేలో ఇండియా అమ్మాయిలకు ఓటమి తప్పలేదు. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో జార్జియా వోల్‌‌ (101), ఫోబ్‌‌ లిచ్‌‌ఫీల్డ్‌‌ (80) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఆసీస్‌‌ 5 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది.  

టాస్‌‌ నెగ్గిన ఇండియా 50 ఓవర్లలో 251/9 స్కోరు చేసింది. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (54), ప్రతీకా రావల్‌‌ (52), స్మృతి మంధాన (31) ఆకట్టుకున్నారు. జెమీమా రోడ్రిగ్స్‌‌ (11), దీప్తి శర్మ (1), అమన్‌‌జోత్‌‌ (13) ఫెయిలైనా రిచా ఘోష్‌‌ (22), కశ్వీ గౌతమ్‌‌ (25), క్రాంతి గౌడ్‌‌ (19) రాణించారు. ఆష్లే గార్డ్‌‌నర్‌‌, అనాబెల్‌‌ సదర్లాండ్‌‌, అలనా కింగ్‌‌ తలో రెండు వికెట్లు తీశారు. 

ఛేదనలో ఆసీస్‌‌ 36.1 ఓవర్లలో 252/5 స్కోరు చేసి నెగ్గింది. ఇన్నింగ్స్‌‌ ఐదో ఓవర్‌‌లోనే అలీసా హీలీ (6) ఔటైనా.. లిచ్‌‌ఫీల్డ్‌‌, వోల్‌‌ మెరుగ్గా ఆడారు. అయితే, 19 రన్స్‌‌ వద్ద వోల్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను క్రాంతి గౌడ్‌‌ మిస్‌‌ చేయగా, తర్వాత కశ్వీ గౌతమ్‌‌ (2/47) బౌలింగ్‌‌లో డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌లో ఇచ్చిన క్యాచ్‌‌ను మంధానా వదిలేసింది. 

చివర్లో రిచా ఘోష్‌‌ మూడోసారి డ్రాప్‌‌ చేయడంతో వోల్‌‌ సెంచరీ పూర్తి చేసింది. లిచ్‌‌ఫీల్డ్‌‌తో మూడో వికెట్‌‌కు 119 రన్స్‌‌ జోడించి ఆసీస్‌‌ విజయాన్ని ఖాయం చేసింది. దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది. వోల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది.