పెర్త్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్ (83 బాల్స్లో 16 ఫోర్లు, 4 సిక్స్లతో 123 నాటౌట్) టీ20 తరహా బ్యాటింగ్ చేయడంతో రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై నెగ్గింది. ఫలితంగా సిరీస్లో కంగారూలు 1–0 ఆధిక్యంలో నిలిచారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరంభం నుంచే ఇంగ్లిష్ బౌలర్లపై విరుచుకుపడ్డ హెడ్.. జాక్ వెదరాల్డ్ (23)తో తొలి వికెట్కు 75, మార్నస్ లబుషేన్ (51)తో రెండో వికెట్కు 117 రన్స్ జోడించాడు.
బ్రైడన్ కార్స్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 123/9 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 132 రన్స్కే ఆలౌటైంది. స్టోక్స్ 5, కార్స్ 3, ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టారు. 40 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 34.4 ఓవర్లలో 164 రన్స్కే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ ముందు 205 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. అట్కిన్సన్ (37) టాప్ స్కోరర్. ఒలీ పోప్ (33), డకెట్ (28) ఓ మాదిరిగా ఆడారు. బోలాండ్ 4, స్టార్క్, డాగెట్ చెరో మూడు వికెట్లు తీశారు.
స్టార్క్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో హెడ్ పలు రికార్డులు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ (4వ ఇన్నింగ్స్)లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా హెడ్ (69 బాల్స్) రికార్డులకెక్కాడు. 123 ఏళ్ల కిందట గిల్బర్ జెసోఫ్ (ఇంగ్లండ్, 76 బాల్స్) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. యాషెస్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా హెడ్ (69 బాల్స్) నిలిచాడు. గిల్ క్రిస్ట్ (57 బాల్స్) ముందున్నాడు.
