లాక్డౌన్ వల్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక చాలామంది అవస్థలు పడుతున్నారు. కానీ ఆకలి దప్పులతో అవస్థలు పడేవాళ్లు ఎక్కడో ఓచోట ఎప్పుడూ ఉంటారు. అలాంటి వాళ్లను గుర్తించి, ఏదోరకంగా వాళ్లను ఆదుకునే‘ఆస్య ఫౌండేషన్’.కరోనా బాధితులుగా మారిన వాళ్లకోసం కూడా సాయం చేస్తోంది.
కామన్గా యూత్కు ఉండే ఇంట్రెస్ట్లు వేరు. ఎంజాయ్ చెయ్యాలి.. కెరీర్ను బిల్డప్ చేసుకోవాలి.. లైఫ్లో సెటిల్ కావాలనే ఆలోచిస్తరు. లైఫ్లో సెటిల్ అయినోళ్లు మాత్రమే సేవా కార్యక్రమాలు, దానధర్మాల గురించి ఆలోచిస్తరు అనుకుంటరు. కానీ ‘ఆస్య ఫౌండేషన్’ మెంబర్స్ను చూస్తే మాత్రం డిఫరెంట్ ఒపీనియన్ కలుగుతది. వీళ్లను చూస్తే అందరిలా కాకుండా ‘జరా హట్ కే’ యూత్ అనిపిస్తది. వీళ్లెవరూ పెద్దగా లైఫ్లో సెటిల్ కాలేదు. కొంతమంది ఇంకా చదువుకుంటున్నరు. ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే జాబ్స్లో చేరినోళ్లు ఉన్నరు. అయినప్పటికీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నరు.
ఎప్పటి నుంచో. . .
కొంతమంది స్నేహితులతో కలిసి 2015లో ఆస్య ఫౌండేషన్ను స్టార్ట్ చేసిండు శ్రీరామ్. మొదట్లో క్యాన్సర్ బారిన పడిన పిల్లల ట్రీట్మెంట్ కోసం చేతనైన సాయం చేసెటోళ్లు. వీళ్లు చేస్తున్న సాయం చూసి చాలామంది వాలంటీర్లు ఆస్య ఫౌండేషన్లో సభ్యులుగా చేరడంతో సేవా కార్యక్రమాలను కూడా విస్తరించిన్రు. ఓల్డేజ్ హోమ్స్కు వెళ్లి వాళ్ల అవసరాలు తీర్చడం, అనాథశరణాలయాలకు వెళ్లి పిల్లలకు ఏమేం తక్కువున్నయో చూసి, వాటిని సమకూర్చడం, డబ్బుల్లేక చదువు మానేసిన పిల్లల గురించి తెలిస్తే వాళ్ల ఇంటికే వెళ్లి చదువుకు డబ్బు సాయం చెయ్యడం, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ల ట్రీట్మెంట్కు సాయం చెయ్యడం.. వంటి పనులు చేస్తున్నరు.
లాక్డౌన్లో మరింతగా..
లాక్డౌన్ మొదలయ్యాక ఆకలితో అలమటిస్తున్న వాళ్లే ఎక్కడ చూసినా కనిపిస్తుండడంతో వాళ్ల ఆకలి తీర్చడం మీదనే ఫోకస్ పెట్టిన్రు. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా.. తెలంగాణతోపాటు ఏపీలోని 14 జిల్లాల్లో, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆకలితో ఉన్నవాళ్లను ఆదుకునేందుకు సాయం చేస్తున్నరు. ఇప్పటిదాకా రెండువేల రెండు వందల కుటుంబాలకు అవసరమైన నిత్యావసరాలను అందజేయడమే కాకుండా 1,700 మందిని పర్సనల్గా ఆదుకున్నరు. అంతేకాకుండా ఏడు అనాథ శరణాయాల్లోని పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నరు. ఆస్పత్రుల్లో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులకు అవసరమైన 1,700 మాస్క్లు, పీపీఈ కిట్స్ను కూడా అందజేసిన్రు. ఈ సాయమంతా వీళ్ల జేబుల్లో నుంచి కొంత, దాతలు కొంత ఇవ్వడంతో కంటిన్యూ చేస్తున్నరు.
– సుధాకర్ సాదుల
కనీసం ఐదువేల కుటుంబాలు
ఆస్య ఫౌండేషన్ తరఫున కనీసం ఐదువేల కుటుంబాలను ఆదుకోవాలనేది టార్గెట్. ముందుగా వారం పదిరోజులకు సరిపడా సరుకులు ఇస్తున్నారు. ఆ లోపే మళ్లీ ఫౌండేషన్ మెంబర్స్ వెళ్లి మరో వారానికి సరిపడా అందజేస్తారు. ఫౌండేషన్లో దాదాపు మూడువేల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. వాళ్లంతా వెల్ ఎడ్యుకేటెడ్. అందుకే సాయం అందించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ సాయంతో పాటు భవిష్యత్తులో స్టూడెంట్ల అవసరాలను తీర్చడానికి ఆస్య ఫౌండేషన్ ప్లాన్ చేస్తోంది. పిల్లలకు ఇన్నొవేటివ్ టెక్నాలజీని పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు వీళ్లు అందించే సర్వీసులను మొత్తం పదకొండు విభాగాలుగా డివైడ్ చేయబోతున్నారు. మరోవైపు ఓల్డేజ్ హోంలోనే అనాథ పిల్లలు కూడా ఆశ్రయం పొందేలా ఒక హోం ఏర్పాటు చేయాలనేది ఈ ఫౌండేషన్ ఫ్యూచర్ ప్లాన్. ప్రస్తుతానికైతే లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవాళ్లను ఆదుకోవడంపైనే ఆస్య ఫౌండేషన్ ఫోకస్ చేస్తోంది.