
హాలియా, వెలుగు: మరో రెండ్రోజుల్లో నాగార్జునసాగర్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం నుంచి భారీ వరద వస్తుండడంతో సాగర్ ప్రాజెక్ట్ వేగంగా నిండిపోతోంది. రోజూ సగటున 10 అడుగుల చొప్పున నీటిమట్టం పెరుగుతోంది. ఇదే స్థాయిలో వరద వస్తే సోమవారం నాటికి గేట్లను ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టుకు 4,54,734 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నీటిమట్టం 573.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 312.0450 టీఎంసీలకు గానూ 264.8534 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 36,484 క్యూసెక్కులను వదులుతున్నారు. పవర్హౌస్ నుంచి 35,284 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తుండగా.. 1,200 క్యూసెక్కులను ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ)కి వదులుతున్నారు. వరద భారీగా వస్తుండడం.. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోవడంతో ఆగస్టు మొదటి వారంలోనే ఎడమకాల్వ ఆయకట్టుకూ నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.
గేట్లను పరిశీలించిన అధికారులు
ప్రాజెక్టు నిండుతుండడంతో గేట్లను ఎత్తేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రాజెక్ట్ 26 రేడియల్ క్రస్ట్ గేట్లను ప్రాజెక్ట్ సీఈ శ్రీకాంత్ రావు, ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈ పరమేశ్, ఏఈఈ కృష్ణయ్యలు పరిశీలించారు. గేట్లు ఎత్తితే లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదమున్నందున.. అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా, గుంటూరు కలెక్టర్లతో పాటు ఆ జిల్లాల పోలీసు అధికారులను అలర్ట్ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శ్రీశైలానికి ఐదు లక్షలపైన ఇన్ ఫ్లో
ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. జూరాల నుంచి 4.78 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. సుంకేశుల నుంచి 53,774 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,31,774 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,67,920 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఏపీ వైపు ఉన్న కుడిగట్టు పవర్హౌస్లో కరెంట్ తయారీ ద్వారా 30,648 క్యూసెక్కులు, తెలంగాణ వైపున్న ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీరు నదిలోకి విడుదలవుతోంది.